హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): ‘ఇచ్చట పెట్టుబడిదారులకు మాత్రమే ప్రవేశం’ ‘కాసులుంటేనే కాషాయ కండువా కప్పుతాం’ ‘మీరు వందల కోట్లు ఖర్చు చేయగలరా? అయితే మీకే టిక్కెట్లు’ ప్రస్తుతం బీజేపీ పాటిస్తున్న విధానమిది. రాష్ట్ర బీజేపీలో ఇటీవల చేరిన వారి జాబితాను పరిశీలిస్తే ఇదే స్పష్టం అవుతుంది. బడా పారిశ్రామికవేత్తలకు మాత్రమే పార్టీ రెడ్ కార్పెట్ పరుస్తున్నది. నయానో, భయానో వారిని కమలం గూటికి చేర్చుతున్నది. రాష్ట్రం లో బీజేపీని ప్రజలు అభిమానించి, ఆదరించే పరిస్థితి లేదు కాబట్టి వేల కోట్లు కుమ్మరించి అయినా ఓట్లను కొనాలని ఎజెండాగా పెట్టుకొన్నది. దేశవ్యాప్తంగా బీజేపీ అంటేనే పెట్టుబడిదారుల పార్టీగా వర్ధిల్లుతున్నది. కేంద్రంలో అదానీ, అంబానీ పార్టీని పెంచి పోషిస్తున్నారు. ఇదే సూత్రాన్ని తెలంగాణలో అమలుచేస్తూ పదుల సంఖ్యలో పారిశ్రామికవేత్తలను చేర్చుకొని విచ్చలవిడిగా డబ్బు వెదజల్లుతున్నారు.
డబ్బుంటే అభయం దొరికినట్టే
బీజేపీలో కొన్నేండ్లుగా చేరిన నేతలను పరిశీలిస్తే.. అందరూ కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలే. దాదాపు అందరూ కోట్లను మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేయగలిగే స్థోమత ఉన్నవారే. కొండా విశ్వేశ్వర్రెడ్డి.. అపోలో హాస్పిటల్ డైరెక్టర్, వివిధ వ్యాపారాలున్న బిలియనీర్. రూ.వేల కోట్ల విలువైన తన ఆస్తులను కాపాడుకొనేందుకే కొండా అన్ని పార్టీలు మారి చివరికి బీజేపీలో చేరారనే విమర్శలు ఉన్నాయి.
మాజీ ఎంపీ జితేందర్రెడ్డి పరిస్థితి కూడా దాదాపు ఇదే. పార్టీలో చేరింది మొదలు ఈ ఇద్దరితో విపరీతంగా ఖర్చు చేయిస్తున్నారని పార్టీ వర్గాలే చెప్తున్నాయి. విశాఖ ఇండస్ట్రీస్ అధినేత వివేక్ వెంకటస్వామి తన ఆస్తుల రక్షణ కోసం అధికారంలో ఉన్న పార్టీలో చేరడం ఆనవాయితీ. తన పైకి ఐటీ, ఈడీ రానీయకుండా చూస్తే మీడియా సహకారం అందిస్తా అనే తరహాలో పరస్పర ఒప్పందంపై పార్టీలో చేరినట్టు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. వీరే కాదు.. డీకే అరుణ, గరికపాటి మోహన్రావు, వీరేందర్గౌడ్, చాడా సురేశ్రెడ్డి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇటీవల బీజేపీలో చేరినవారంతా పారిశ్రామికవేత్తలు, రియల్టర్లు, అక్రమ వ్యాపారులే కనిపిస్తారు. దాదాపు అందరూ ఐటీ, ఈడీ దాడులకు భయపడి చేరినట్టు పార్టీలో చర్చ జరుగుతున్నది. బడా పారిశ్రామికవేత్త, పేదల అసైన్డ్ భూములను బలవంతంగా ఆక్రమించిన ఈటల రాజేందర్ను టీఆర్ఎస్ నుంచి బర్తరఫ్ చేస్తే బీజేపీ ఎదురెళ్లి మరీ స్వాగతం పలికింది. చేరికల కమిటీ చైర్మన్ అంటూ ఆయనను రాష్ట్రవ్యాప్తంగా తిప్పుతూ, డబ్బు ఎర చూపి ప్రలోభాలకు పాల్పడుతున్నట్టు విశ్లేషకులు చెప్తున్నారు. ఇటీవల దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఇద్దరు వ్యాపారవేత్తలు భారీగా ఫండింగ్ చేశారని, అప్పటి ఖర్చుల లెక్కలు ఇంకా తేలనేలేదని సమాచారం.
మునుగోడు టార్గెట్ రూ.500 కోట్లు
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి స్వయంగా కాంట్రాక్టర్. కాంగ్రెస్లో ఉన్నన్నాళ్లూ రూ.వేల కోట్ల పనులు, రూ.వందల కోట్ల లాభాలు గడించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టులు రాకపోవడంతోపాటు ఐటీ, ఈడీ దాడుల భయం వెంటాడింది. దీంతో కమలం పార్టీకి లొంగిపోయారు. వెంటనే బీజేపీ అభయం ఇచ్చింది. కోమటిరెడ్డికి చెందిన సుశీ ఇన్ఫ్రాకు తగిన స్థాయి లేకపోయినా రూ.22 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చింది. మూడేండ్లుగా బీజేపీకి టచ్లో ఉంటే రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు వచ్చిందని స్వయంగా రాజగోపాల్రెడ్డి ఒప్పుకొన్నారు. ఆయనతో కాంగ్రెస్కు రాజీనామా చేయించి అవసరం లేకపోయినా మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ క్రియేట్ చేసింది. ‘ఉప ఎన్నిక వస్తే నా అడ్రస్ గల్లంతవుతుంది’ అని రాజగోపాల్ నెత్తీనోరూ మొత్తుకున్నా విన్న నాథుడే లేడని సమాచారం. తనకు సొంతంగా ప్రజల్లో ఆదరణ లేదని, మునుగోడులో బీజేపీకి లీడర్, క్యాడర్ లేదని చెప్పారట. గత ఎన్నికల్లో బీజేపీకి 6 శాతం ఓట్లు వచ్చాయని, అనవసరంగా ఉప ఎన్నిక తెస్తే కనీసం డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదని వివరించినా వినలేదని సమాచారం. పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది కాబట్టి.. రూ.500 కోట్లయినా ఖర్చు పెట్టేందుకు సిద్ధం కావాలని ఆదేశించినట్టు తెలిసింది. కొండా, జితేందర్ రెడ్డి సైతం అదనంగా ఫండింగ్ ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ప్రతి రాష్ట్రంలో పైసా రాజకీయం
బీజేపీ ప్రతి రాష్ట్రంలోనూ డబ్బుతో అధికారంలోకి రావాలని చూస్తున్నది. అదానీ కోసం ప్రపంచ వ్యాప్తంగా మోదీ మోకరిల్లి మరి కాంట్రాక్టులిప్పించారని శ్రీలంక ఘటనతో రుజువైంది. ఆ నల్లధనంతో బీజేపీని దేశమంతటా విస్తరించేందుకు బీజేపీ కుట్ర పన్నింది. ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చితే రూ.6 వేల కోట్లు ఇస్తామని బీజేపీ ఎర చూపినట్టు స్వయంగా ఆప్ ఎమ్మెల్యేలు ఒప్పుకోవడమే ఇందుకు నిదర్శనం. మహారాష్ట్రలో ఒక్కో ఎమ్మెల్యేకు రూ.వందల కోట్లు ఇచ్చి ప్రభుత్వాన్ని కూలదోసింది. ఇలా.. బీజేపీ ఇప్పటివరకు 10 రాష్ర్టాల్లో ‘పైసా రాజకీయం’తో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది.