75 ఏండ్ల స్వతంత్ర భారత చరిత్రలోనే రాజకీయ చీకటి అలుముకొన్నదిప్పుడు. ప్రజాస్వామ్యానికి ముసుగు పడింది. అధికార దాహంతో ప్రజలిచ్చిన తీర్పును తుంగలో తొక్కి కుతంత్రాలతో ఎన్నో రాష్ర్టాల్లో అధికారం చేజిక్కించుకొన్నది బీజేపీ. ఇప్పటికే ప్రజాభీష్ఠానికి వ్యతిరేకంగా 8 రాష్ర్టాల్లో పాలన సాగిస్తున్నది. ఇప్పుడు ఢిల్లీ, జార్ఖండ్ ప్రభుత్వాలపై కుట్రలు పన్నుతున్నది. రేపోమాపో తమిళనాడు ప్రభుత్వాన్నీ కూలుస్తామని నిస్సిగ్గుగా వ్యాఖ్యానిస్తున్నది. ఇదీ బీజేపీ దుర్నీతి.. మోదీ కుట్రల పాళి..
1. అరుణాచల్ప్రదేశ్:
2016లో కాంగ్రెస్ సీఎం పెమాఖండుతో తిరుగుబావుటా ఎగురవేయించి, ఆ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలను పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్లో చేర్చించి, అనంతరం బీజేపీలో కలుపుకొన్నది.
2. కర్ణాటక:
2019లో జేడీఎస్-కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కుమారస్వామి సీఎం అయ్యారు. ఇది మింగుడుపడని బీజేపీ.. అధికార కూటమికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలను లొంగదీసుకొని ఆ సర్కారును పడగొట్టి, గద్దె నెక్కింది.
3. మధ్యప్రదేశ్:
2018 ఎన్నికల్లో 121 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. జ్యోతిరాదిత్య సింధియాతో పాటు 26 మంది ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొని ఆ పార్టీని పడగొట్టింది.
4. గోవా:
2017లోనే గోవాలోనూ 17 సీట్లతో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ, 13 సీట్లు గెలుచుకొన్న బీజేపీ.. ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేను తనవైపు తిప్పుకొన్నది. మరో పది మందిని ఫిరాయించేలా చేసింది.
5. మణిపూర్:
2017లో 27 సీట్లు గెలిచి కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా నిలిచింది. కానీ, 21 సీట్లే వచ్చిన బీజేపీ.. 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లొంగదీసుకొని అధికారాన్ని చేపట్టింది.
6. సిక్కిం:
అసలు ఇక్కడ బీజేపీకి ఒక్క సీటు కూడా రాలేదు. సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకొని అధికారం చెలాయిస్తున్నది.
7. పుదుచ్చేరి:
కాంగ్రెస్, డీఎంకేకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి బీజేపీ అధికారాన్ని లాక్కొన్నది.
8. మహారాష్ట్ర:
శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు.. శివసేనకు చెందిన ఏక్నాథ్షిండేతో చేతులు కలిపింది. 40 మంది ఎమ్మెల్యేలను లాగి శివసేనను నిట్టనిలువునా చీల్చింది. ప్రభుత్వాన్ని పడగొట్టి, అధికారాన్ని చేజిక్కించుకొన్నది.
9. బీహార్:
2015లో నితీశ్ నేతృత్వంలోని మహాకూటమి సర్కారులో చీలిక తెచ్చి, నితీశ్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. మిత్రపక్షం జేడీయూలో చీలిక తెచ్చేందుకు యత్నించగా.. నితీశ్ రివర్స్ పంచ్ ఇచ్చి.. ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు.
10.ఢిల్లీ:
కేజ్రీవాల్ సర్కారును అస్థిరపరిచేందుకు మంత్రులపై ఈడీతో దాడులు చేయించింది. ఒక్కొక్కరికి 20 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆప్ ఆరోపించింది.
11.జార్ఖండ్:
హేమంత్ సొరేన్ సర్కారును కూల్చేందుకు గత నాలుగు నెలలుగా ఈడీతో దాడులు చేయిస్తున్నది. సొరేన్పై అనర్హత వేటు వేసేందుకు పావులు కదిపింది.
12.బెంగాల్:
మమత సర్కారును కూల్చేందుకు.. మమత మేనల్లుడు అభిషేక్ సహా అధికార పార్టీకి చెందిన మంత్రులు, నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నది.
13. రాజస్థాన్:
రాజస్థాన్లోనూ అధికారం చేజిక్కించుకునేందుకు బీజేపీ శతవిధాలా ప్రయత్నించింది. సచిన్ పైలట్ను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నించి విఫలమైంది.