బీజేపీ సారథ్యంలోని కేంద్ర సర్కారు తెలంగాణ పట్ల ప్రదర్శిస్తున్న వివక్ష మరోసారి బయటపడింది. అసెంబ్లీ స్థానాలను పెంచాలన్న తెలంగాణ విన్నపాలను ఇంతకాలం ఏ మాత్రం ఖాతరు చేయని కేంద్రం ఇప్పుడు జమ్ముకశ్మీర్ నియోజకవర్గాలను మాత్రం పునర్వ్యవస్థీకరిస్తామంటున్నది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఈ మేరకు ప్రకటన చేశారు. తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అనేక విజ్ఞప్తులు చేసింది. టీఆర్ఎస్ కూడా పార్టీ పరంగా తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరపాలనేది విభజన చట్టంలోనూ స్పష్టంగా ఉన్నది. అయినప్పటికీ కేంద్రం 2031 దాకా పెంచే ది లేదని స్పష్టంగా ప్రకటించింది. కశ్మీర్లో పునర్వ్యవస్థీకరణ జరుపుతున్న సందర్భంలోనైనా కేంద్రం తెలంగాణ డిమాండ్ను పరిగణనలోకి తీసుకోవలసింది.
రాజ్యాంగంలోని 170వ ఆర్టికల్ ప్రకారం 2026 వరకూ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేపట్టడానికి వీల్లేదని కేంద్రం ఇంతకాలం చెప్తూ వచ్చింది. ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీకి ఈ చట్టం ఆటంకం అవుతుందని చెప్పేది. కానీ కేంద్రం తలుచుకుంటే ఈ అవరోధాన్ని సులభంగా అధిగమించవచ్చు. కానీ, పునర్విభజన చట్టంలో ‘ఆర్టికల్ 170కు అనుగుణంగా’ అనే పదం పొరపాటున దొర్లిందని, దానిని ‘ఆర్టికల్ 170లో పేర్కొన్నప్పటికీ’ అని సవరిస్తే సరిపోతుందని టీఆర్ఎస్ నేతలు పలుమార్లు సూచించారు. దీనిపై సానుకూలంగా వ్యవహరించినట్లే కనిపించిన కేంద్రం ఆ తర్వాత పక్కనపెట్టింది. ఇప్పుడు జమ్ముకశ్మీర్ విషయంలో మాత్రం వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నది. మరి, ఇక్కడ ఆర్టికల్ 170 ప్రతిబంధకం కాదా?
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణకు అనుకూలంగా ఉన్న పలు హామీలను కేంద్రం పట్టించుకోవడం లేదు. ఇదే చట్టంలోని తెలంగాణ వ్యతిరేక అంశాలను మాత్రం అమలుచేస్తున్నది. పోలవరం ముంపు గ్రామాల బదలాయింపును హడావుడిగా అమలుచేసింది. తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలుపాలన్న నిబంధనను మోదీ ప్రభుత్వం తొలి క్యాబినెట్ భేటీలోనే ఆమోదించింది. ఆయా మండలాల ప్రజలు మమ్మల్ని ఏపీలో కలపొద్దంటూ అర్థించినా కూడా కేంద్రం కనికరించలేదు. నియోజకవర్గాల పెంపును చేపట్టాలని తెలంగాణతో పాటు ఏపీ కూడా కోరుతున్నది. ఇది రెండు రాష్ర్టాల మధ్య వివాదాస్పద అంశం కాదు, కేంద్రానికి జరిగే నష్టమేమీ లేదు. అయినా నానబెట్టడమెందుకు? కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా రాష్ర్టాల ఆకాంక్షల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించాలి.