బుల్డోజర్ రాజకీయాల్ని నమ్ముకున్న బీజేపీ మరో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని కూల్చటంలో విజయం సాధించింది. దేశంలో మోదీ హయాం మొదలైన తర్వాత పలు రాష్ర్టాల్లో ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను అప్రజాస్వామికంగా బీజేపీ గద్దె దించింది. ఈ ప్రజాస్వామ్య హననానికి కొనసాగింపే మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే సర్కారు పతనం. తమతో 25 ఏండ్ల బంధాన్ని తెంచుకొని కాంగ్రెస్, ఎన్సీపీ తో శివసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచీ బీజేపీ ఏదో విధంగా ఇబ్బందులు సృష్టిస్తూనే ఉన్నది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఉద్ధవ్ ఠాక్రే శాసన మండలికి నిర్ణీత గడువులోగా ఎన్నిక కావాల్సి ఉండగా.. చివరి వరకూ అడ్డుకోవటానికి ప్రయత్నించింది. ఈడీ, సీబీఐ ద్వారా కూటమి పార్టీలపై ముఖ్యంగా ఎన్సీపీకి చెందిన మంత్రులపై దాడులు జరిపించింది. వారిని జైలు పాలు చేసింది.
వాస్తవానికి శివసేనలో రగిలిన తిరుగుబాటు ఎవరూ ఊహించనిది. అకస్మాత్తుగా అది తెర పైకి వచ్చింది. పార్టీ అధినేత ఉద్ధవ్ కూడా తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండేను పలుమార్లు చర్చలకు ఆహ్వానించారు. కాంగ్రెస్తో, ఎన్సీపీతో పొత్తు వీడి బీజేపీతో కలువాలన్న వారి విచిత్రమైన డిమాండ్ మీద కూడా మాట్లాడుదాం రమ్మనే పిలిచారు. కానీ, షిండే వర్గం ఎంతమాత్రమూ సయోధ్యకు అవకాశం ఇవ్వకుండా, సర్కారును కూల్చటం పైనే దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో విశ్వాస పరీక్ష అన్న అంశం ముందుకొచ్చింది. అంకెల ఆట ఆడబోనంటూ ఉద్ధవ్ రాజీనామా చేయటం, అనూహ్యంగా షిండే సీఎం, ఫడ్నవీస్ డిప్యూటీ సీఎం కావటంతో ఈ రాజకీయ నాటకానికి ముగింపు కార్డు పడింది.
పైకి శివసేనలో తిరుగుబాటులా కనిపిస్తున్న ఈ వ్యవహారం వెనుక బీజేపీ ఉందన్నది బహిరంగ రహస్యమే. అయితే, ఉన్నపళంగా ఉద్ధవ్ సర్కార్ను కూల్చే ఆపరేషన్కు కమలం ఎందుకు దిగిందన్నదే అసలు ప్రశ్న. మరో రెండేండ్లలోపు రానున్న లోక్సభ ఎన్నికలే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. మహారాష్ట్రలో 48 లోక్సభ స్థానాలున్నాయి. అంతేకాదు, దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై ప్రభావం ఆ ఒక్క రాష్ర్టానికే పరిమితం కాదు. వ్యూహాత్మకంగా ఇంత కీలకమైన రాష్ట్రంలో అధికారంలో లేకపోతే, లోక్సభ ఎన్నికలలో బీజేపీకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. దీనివల్లనే ఆగమేఘాల మీద ఉద్ధవ్ ప్రభుత్వాన్ని కూల్చే పనికి పూనుకొన్నట్లుగా తెలుస్తున్నది. మహారాష్ట్రీయుల్లో తమకు చెడ్డ పేరు వస్తే, అసలుకే ఎసరు వస్తుందన్న అంచనాతో షిండేను ముందు ఉంచి బీజేపీ ఈ ఆటాడించినట్లు భావించవచ్చు. అనూహ్యంగా సీఎం పదవిని కూడా అతడికే అప్పగించటాన్ని బట్టి బీజేపీ అసలు ఉద్దేశం లోక్సభ ఎన్నికలేనని స్పష్టమవుతున్నది. మహారాష్ట్రలో బలమైన పార్టీగా ఉన్న శివసేనను బలహీనపర్చటం, రాష్ట్రంలో అధికారాన్ని తన చేతుల్లో ఉంచుకోవటం, అదే సమయంలో, సర్కారును కూల్చిన కుట్రదారు అని తన గురించి ప్రజలు భావించకుండా సీఎం పీఠాన్ని తీసుకోకపోవటం.. ఇదంతా బీజేపీ దీర్ఘకాలిక వ్యూహం. నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు పడ్డదన్న సామెతను బీజేపీ గుర్తుంచుకుంటే మంచిది.