హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): బీజేపీ దిగజారుడుతనం మరోసారి బట్టబయలైపోయింది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తమ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి పెద్ద ఎత్తున వలసలను తట్టుకోలేని బీజేపీ.. డబ్బులు ఎరచూపి ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టాలని ప్రయత్నించి.. అడ్డంగా బుక్కయిపోయింది. గత కొద్దిరోజులుగా బీజేపీలో ఉన్న ముఖ్య నాయకులు టీఆర్ఎస్లోకి క్యూ కడుతున్నారు. ఫలితంగా రోజు రోజుకూ బీజేపీ బలహీనపడుతున్నది. ఈ పరిణామాలు జీర్ణించుకోలేక పోతున్న బీజేపీ నేతలు.. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే ప్రయత్నాలకు తెగించారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మొదటి నుంచి బీజేపీలో స్వచ్ఛందంగా చేరినవారెవరూ లేరు. ఈడీ లేదా సీబీఐని ఉసిగొల్పడం ద్వారానో, భయపెట్టడం లేదంటే.. పదవులు ఎర వేయడం ద్వారానే అనేకమంది బీజేపీలో చేరిన ఉదంతాలు చూశాం. మునుగోడు ఎన్నిక ఆ విధంగానే వచ్చిందని సాక్షాత్తూ ఆ పార్టీ అభ్యర్థే టీవీల ముందు ఒప్పుకొన్నారు. తనకు రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు వచ్చిన తరువాతే బీజేపీలో చేరానని కుండబద్దలు కొట్టారు. ఇదే కోవలో వివిధ పార్టీల్లోని ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలను బెదిరించి, డబ్బులిచ్చి పార్టీలో చేర్చేలా ప్రణాళికను రచించి అమలు చేస్తున్నది. టీఆర్ఎస్లో ఉన్న మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ను బుట్టలో వేసుకొన్నది. అదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి వలసలు మొదలయ్యాయి. కాంగ్రెస్ నుంచి పల్లె రవికుమార్గౌడ్ దంపతులు టీఆర్ఎస్లో చేరగా.. భారీ సంఖ్యలో బీజేపీ నేతలు టీఆర్ఎస్ గూటికి చేరారు. మాజీ ఎంపీ కాషాయ కండువాను కప్పుకున్న ఒకట్రెండు రోజుల్లోనే బీజేపీ నుంచి మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, సీనియర్ నేత దాసోజు శ్రవణ్ సొంత గూటికి చేరుకొన్నారు. వారి వెంట భారీగా అనుచరులు, ద్వితీయ శ్రేణి నాయకులుకూడా గులాబీ జండా కప్పుకొన్నారు. తాజాగా మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్కూడా బీజేపీని వదిలి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయన వెంటకూడా భారీగా అనుచరగణం టీఆర్ఎస్లో చేరింది.
ఈ పరిస్థితిని బీజేపీ తట్టుకోలేకపోయింది. దుగ్ధతో దహించుకుపోయింది. కక్షతో రగిలిపోయింది. ఇదే సమయంలో ఢిల్లీ నుంచి వచ్చిన సూచనలతో.. పక్కాగా ప్రణాళికలు వేసి.. ఏకంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాలకు దిగింది. రూ.వందల కోట్లను ఎరవేసింది. కానీ ఉద్యమకారులైన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమను బీజేపీ నేతలు ప్రలోభాలకు గురిచేస్తున్నారని పోలీసులకు ఉప్పందించారు. తమకు రక్షణ కావాలంటూ విన్నవించారు. దీంతో పోలీసుల రంగ ప్రవేశం చేసి బీజేపీ కుట్రను బట్టబయలుచేశారు. ఇదీ బీజేపీ దిగజారుడుతనానికి పరాకాష్ట.. ఇదే బీజేపీ అసలు రూపం.. రంగు.. గుర్తు.. జెండా.. అజెండా..!