లక్నో : ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయిత్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. అసదుద్దీన్, బీజేపీ పార్టీ మామా-మేనల్లుడి బంధమని విమర్శించారు. పౌరసత్వ (సవరణ) చట్టం -2019, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ) రద్దుపై ఒవైసీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాకేశ్ తికాయిత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఒవైసీ తనకు ఏది కావాలన్నా బీజేపీని నేరుగా అడుగవచ్చు. దీని గురించి ఆయన టీవీలో మాట్లాడకూడదు. ఆయన నేరుగా అడగొచ్చు’ అన్నారు. ఆదివారం ఉత్తరప్రదేశ్లోని బారాబంకిలో జరిగిన బహిరంగ సభలో ఒవైసీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఏఏ, ఎన్ఆర్సీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రెండు చట్టాలను రద్దు చేయకపోతే నిరసన కారులు వీధులను షాహీన్బాగ్గా మారుస్తారని హెచ్చరించారు. సీఏఏ రాజ్యాంగానికి విరుద్ధమని, బీజేపీ ప్రభుత్వం రెండు చట్టాలను రద్దు చేయాలన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా వందలాది మంది ఢిల్లీలోని షాహిన్బాగ్లో నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. గతేడాది కొవిడ్-19 కారణంగా లాక్డౌన్ విధించిన అనంతరం ఢిల్లీ పోలీసులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. ఇదిలా ఉండగా.. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో వంద స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఎంఐఎం చీఫ్ ప్రకటించారు. వచ్చే ఏడాది యూపీలో ఎన్నికలు జరుగనున్నాయి.