అమరావతి: ఏపీలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో మంత్రులకు ప్రజల నుంచి నిరసన సెగలు ఎదురవుతున్నాయి. తాజాగా మరో మంత్రి అంబటి రాంబాబుకు కూడా వ్యతిరేకత ఎదురైంది. అన్ని అర్హతలున్నా పెన్షన్ ఎందుకు నిలిపివేశారంటూ ఓ మహిళ.. వికలాంగుడైన తన తమ్ముడికి పెన్షన్ ఇవ్వట్లేదని, అధికారుల్ని ప్రాధేయపడుతున్నా పట్టించుకోవటంలేదని మరో యువకుడు మంత్రిని నిలదీశారు. అదేవిధంగా స్థానిక సమస్యలపైనామహిళలు మంత్రిని నిలదీశారు. రైతు భరోసా రాలేదని కొందరు..పెన్షన్లు రావటంలేదని మరికొందరు మహిళలు మంత్రిని నిలదీశారు. దీంతో అంబటి రాంబాబుకు ఏం చేయాలో తోచక .. ‘న్యాయం చేస్తామండీ’.. అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంటెపూడిలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఇక్కడ సొంత పార్టీ నేతల నుంచి అసమ్మతి ఎదురైంది. టీడీపీ మద్దతుతో సర్పంచిగా గెలిచిన వ్యక్తికి మంత్రి గ్రామంలో ప్రాధాన్యం ఇస్తున్నారని గ్రామ వైసీపీ నాయకుడు చంద్రశేఖర్రెడ్డి నేతృత్వంలో పార్టీ శ్రేణులు నిరసన గళం వినిపించాయి. వైఎస్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగడంతో ఆశ్చర్యపోవడం మంత్రి వంతయింది. పార్టీ నేతలు సముదాయించినా ఆందోళన కొనసాగించడం విశేషం.
ఇదే గ్రామంలో మరోచోట కూడా మంత్రితో వైసీపీ నాయకుడు ఒకరు వాగ్వాదానికి దిగారు. తన తండ్రి చనిపోయి ఏడాది పూర్తయినా తల్లికి పెన్షన్ మంజూరు చేయలేదంటూ గ్రామ వాలంటీరును వైసీపీ నేత ఒకరు నిలదీయగా సదరు వ్యక్తిమీద వాలంటీరు వాగ్వాదానికి దిగాడు. ‘ఏంటి నోరు లేస్తోంది’.. అని అనేసరికి ఇద్దరి మధ్య వాదన చోటుచేసుకున్నది.