ఉమ్మడి పాలనలో కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. మాటిమాటికీ మోటర్లు కాలిపోయి రైతులు ఇబ్బందులు పడేవారు. అర్ధరాత్రి కరెంటు కోసం వెళ్లి పాముకాటుకు గురై చనిపోయిన రైతులెందరో. నేడు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల నిరంతర ఉచిత, నాణ్యమైన విద్యుత్ రైతులకు లబ్ధి చేకూరుస్తున్నది.
తెలంగాణ రైతాంగం వృద్ధి చెందుతున్న నేపథ్యంలో కేంద్రం అనుసరిస్తున్న నూతన విధానాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురుకానున్నాయి. కేంద్రం తీసుకురాబోతున్న ‘విద్యుత్ సవరణ బిల్లు-2022’ చట్టమే దీనికి ప్రధాన కారణం. కేంద్రం తీసుకువస్తున్న ఈ బిల్లు ద్వారా రైతులపై ఏటా దాదాపు రూ.లక్ష కోట్ల అదనపు భారం పడనున్నది. కేంద్ర, రాష్ర్టాల ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యుత్ రంగం కేంద్రం చేతుల్లోకి వెళ్లనున్నది.
ప్రస్తుతం దేశ స్థాయిలో కేంద్ర విద్యుత్తు నియంత్రణ కమిషన్ (CERC), రాష్ర్టాల స్థాయిలో విద్యు త్తు నియంత్రణ కమిషన్(SERC) ఉన్నాయి. SE RC విద్యుత్ చార్జీలను నిర్ణయించడంతో పాటు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పరిశీలిస్తుంది. కానీ ‘విద్యుత్ సవరణ బిల్లు-2022’ అమలైతే రాష్ర్టాల అధికారాలు తగ్గిపోతాయి. కేంద్రం తన పరిధిలో విద్యుత్ ఒప్పంద ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ(ECEA) ఏర్పాటు చేసి అధికారాలను కేంద్రీకృతం చేస్తుంది. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం.
చట్టంలో భాగంగా National Load Dispatch Center (NLDC) ద్వారా విద్యుత్ పంపిణీ జరుపుతారు. డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఈ ఉత్పత్తి కేం ద్రాలతో ఒప్పందాలు చేసుకోవాలి. PPA (Pow er Purchase Agreement) కేంద్రంలోని ECEA పరిధిలోకి వెళ్తాయి. రాష్ర్టాలకు అధికారాలు తగ్గి, ధర నిర్ణయించే అధికారం కేంద్రం చేతిలోకి వెళ్తుంది. సరఫరా, పంపిణీ వ్యవస్థలు ప్రైవేటుపరం అయ్యే అవకాశం ఉన్నది. తద్వారా విద్యుత్ చార్జీలు పెరిగి ప్రజలపై భారం పడుతుంది. కొత్త చట్టంలోని ముఖ్యాంశాలు కింది విధంగా ఉన్నాయి.
కాస్ట్ టు సర్వ్ పద్ధతి: ఈ విధానంతో విద్యుత్ ఉత్పత్తికి అయ్యే మొత్తం ఖర్చును అన్ని వర్గాలు సమానంగా భరించాల్సి వస్తుంది. విద్యుత్ ఉత్పత్తి ఖర్చుకు అనుగుణంగా చార్జీలు ఉండాలని ఈ చట్టం చెప్తున్నది.
క్రాస్ సబ్సిడీ విధానం: ఈ విధానాన్ని తొలగించాలని కేంద్రం చెప్తున్నది. అంటే రూ.కోట్ల వ్యాపారాలు చేసే పరిశ్రమలకు, వ్యవసాయం చేసే రైతులకు ఒకే ధరకు కరెంటు ఇవ్వడానికి స్లాబులను పెంచనున్నారు. ఈ పేరుతో విద్యుత్ చార్జీలను పెంచే వెసులుబాటు కేంద్రానికి ఉంటుంది.
రాయితీ ఇవ్వాలనుకునే రాష్ట్ర ప్రభుత్వాలు ఆ మొత్తాన్ని వినియోగదారుల అకౌంట్లలోనే వేయాలి. కానీ వినియోగదారుడు ముందుగానే పూర్తి బిల్లును చెల్లించాలి. బిల్లు చెల్లింపు ఆలస్యమైతే వెంటనే కరెంటు కనెక్షన్ కట్ చేయాలన్న నిబంధన కూడా ఈ బిల్లులో ఉన్నది. ఈ పరిణామాల వల్ల భవిష్యత్తులో ఎన్నికయ్యే ప్రభుత్వాలు సబ్సిడీలను ఎత్తివేస్తే రైతులు చార్జీలు కట్టలేని పరిస్థితి వస్తుంది. వాటిని నిలువరించడమే ప్రస్తుతం మనందరి కర్తవ్యం.
– నిఖిల్ అల్లేని
96666 51215