న్యూఢిల్లీ : ఓ ఇద్దరు దొంగలు డెలివరీ బాయ్ బైక్ను దొంగిలించేందుకు యత్నించారు. కానీ ఆ అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డ్ అప్రమత్తంగా ఉండటంతో పోలీసులకు ఆ దొంగలు దొరికిపోయారు. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని ఎవరెస్ట్ అపార్ట్మెంట్లో వెలుగు చూసింది.
ఇవాళ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఓ ఇద్దరు వ్యక్తులు మున్సిపల్ అధికారులమని చెప్పి అపార్ట్మెంట్లోకి ప్రవేశించారు. వారిద్దరూ ఆ అపార్ట్మెంట్లో దొంగతనం చేసేందుకు వెళ్లారు. కానీ భవనాలను తనిఖీ చేస్తున్నట్లు నటించారు. అయితే ఓ డెలివరీ ఏజెంట్ తన బైక్ తాళాలను ఆ వాహనానికే ఉంచి వెళ్లాడు. దీన్ని గమనించిన ఆ ఇద్దరు వ్యక్తులు బైక్ను తీసుకొని పారిపోయేందుకు యత్నించారు. అప్రమత్తమైన బైక్ యజమాని గట్టిగా కేకలు వేయడంతో గేట్ వద్ద కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డ్ అలర్ట్ అయ్యాడు. ఇక అతను గేటు మూయడంతో వేగంగా వెళ్లిన బైక్ ఆ గేటు మధ్యలో ఇరుక్కుపోయింది. ఇద్దరిలో ఒకరు పారిపోగా, మరొకరిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.