పాట్నా : బీహార్కు చెందిన ఓ ఐఏఎస్ ఆఫీసర్ హర్జోత్ కౌర్ భమ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. శానిటరీ ప్యాడ్స్తో పాటు కండోమ్స్ కూడా అడిగేలా ఉన్నారని భమ్రా చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. ఆడబిడ్డల స్వశక్తే.. బీహార్ సమృద్ధి అనే వర్క్షాప్లో మహిళా, శిశు అభివృద్ధి కార్పొరేషన్లో పని చేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ హర్జోత్ కౌర్ భమ్రా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఓ విద్యార్థిని మాట్లాడుతూ.. రూ. 20 – 30 మధ్య ధరకు రాష్ట్ర ప్రభుత్వం శానిటరీ ప్యాడ్స్ను ఇవ్వగలదా? అని ప్రశ్నించింది. విద్యార్థిని ప్రశ్నతో హర్జోత్ కౌర్ ఆవేశంతో ఊగిపోయారు. రేపు జీన్స్లను కూడా ఇవ్వమని అడగండి.. ఆ తర్వాత అందమైన షూ కూడా ఇవ్వాలని అడగండని విద్యార్థినులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అవే కాదు.. ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్, కండోమ్స్ను కూడా ప్రభుత్వం నుంచి ఆశించేలా ఉన్నారని ఐఏఎస్ ఆఫీసర్ వ్యాఖ్యానించారు.
హర్జోత్ కౌర్ వ్యాఖ్యలపై ఓ విద్యార్థిని స్పందిస్తూ.. ప్రజల ఓట్లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని పేర్కొంది. ఈ వ్యాఖ్యలపై కూడా ఆమె మండిపడ్డారు. ఇది మీ మూర్ఖత్వపు పని. ఓటు వేయకండి.. ఆ తర్వాత పాకిస్తాన్గా మార్చేయండని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మీరు డబ్బుకే ఓటు వేస్తారా? అని సదరు ఆఫీసర్ విద్యార్థినిని ప్రశ్నించింది.
మరో విద్యార్థిని మాట్లాడుతూ.. మా పాఠశాలలో టాయిలెట్లను ధ్వంసం చేశారు. బాలికల టాయిలెట్లలోకి బాలురు తరుచుగా ప్రవేశిస్తున్నారు. ఈ మాటలకు ఆఫీసర్ స్పందిస్తూ.. మీ ఇండ్లలో మీకు వేర్వేరుగా టాయిలెట్స్ ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఈ విషయంపై మీరే సమాధానం చెప్పాలని విద్యార్థులను ఆమె అడిగారు. కొన్ని విషయాలను మీరు అడగొద్దని సూచించారు. ఐఏఎస్ ఆఫీసర్ భమ్రా చేసిన వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు.