పాట్నా: ఒక ప్రభుత్వ కార్యక్రమానికి మంత్రికి బదులు ఆయన సోదరుడు హాజరయ్యారు. దీంతో విపక్షాలు దీనిపై అసెంబ్లీలో మండిపడ్డాయి. బీహార్ మంత్రి ముఖేష్ సహాని సోదరుడు, సంతోష్ కుమార్ సహాని శుక్రవారం వైశాలి జిల్లాలోని హాజీపూర్లో జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమానికి హాజరయ్యారు. లబ్ధిదారులకు పథకాలను అందజేశారు. తన సోదరుడు బిజీగా ఉండటంతో ఆయనకు బదులు తాను వచ్చినట్లు మీడియాతో అన్నారు.
మరోవైపు ఈ అంశంపై ప్రతిపక్షాలు శుక్రవారం అసెంబ్లీలో మండిపడ్డాయి. మంత్రి ముఖేష్ సహానీ రాజీనామా చేయాలని, ఆయన సోదరుడిని అరెస్టు చేయాలని, ఈ ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా, దీని గురించి తనకు తెలియదని సీఎం నితీశ్ కుమార్ సభలో తెలిపారు. ఇలాంటివి జరుగకూడదన్న ఆయన ఇది నిజమైతే షాకింగ్ అని చెప్పారు. దీనిని పరిశీలిస్తానని సభకు హమీ ఇచ్చారు.