పాట్నా: బీహార్ పోలీసులకు డ్యూటీలో ఉన్నప్పుడు సెల్ఫోన్ వాడకం, సామాజిక మాధ్యమాలు చూడటంపై నిషేధం విధించారు. బీహార్ డీజీపీ ఎస్కే సింగాల్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ డ్యూటీ, వీఐపీ డ్యూటీలో ఉండేవారు తప్పనిసరిగా ఈ నియమాన్ని పాటించాలని సీనియర్ పోలీసు అధికారులకు రాసిన ఒక లేఖలో స్పష్టం చేశారు. ఉల్లంగించేవారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బయట డ్యూటీలో ఉన్న సమయాల్లో పోలీసులు విపరీతంగా సెల్ఫోన్ వాడుతూ, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ కనిపిస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. “పాట్నా నగరంలో పలుచోట్ల పోలీసులు సెల్ఫోన్లో గేమ్ లు ఆడుతూ లేదా మాట్లాడుతూ, మెసేజీలు పంపుకూంటూ కనిపిస్తున్నారు. ఇదే వారికి ప్రధానమైన డ్యూటీ అయినట్టుంది” అని డీజీపీ తన లేఖలో పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో, పౌరుల సమస్యల పట్ల స్పందించడంలో పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిన అవరముందని అన్నారు. పైగా రద్దీ కూడళ్ల వద్ద లేదా వీఐపీ డ్యూటీల్లో పనిచేసే పోలీసులు సెల్ఫోన్తో కనిపిస్తే డిపార్టుమెంటు ఇమేజీ దెబ్బ తింటుందని తెలిపారు. పైగా సెల్ఫోన్ వల్ల దృష్టి మళ్లే అవకాశం కూడా ఉందని గుర్తు చేశారు.