న్యూయార్క్ : టెక్ దిగ్గజాలు ఉద్యోగులను తొలగించడం, ఖర్చు తగ్గించుకునేందుకు హైరింగ్ ప్రక్రియను నిలిపివేస్తుండటంతో జాబ్ మార్కెట్లో అనిశ్చితి నెలకొంటోంది. మైక్రోసాఫ్ట్ నుంచి నెట్ఫ్లిక్స్ వరకూ టెక్ పరిశ్రమలో కనిపిస్తున్న ట్రెండ్ ఉద్యోగార్ధుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.
ఎలక్ట్రానిక్ కార్ల తయారీ సంస్ధ టెస్లా తన శాన్ మటియో, కాలిఫోర్నియా కార్యాలయాలను మూసివేయడంతో పాటు ఆటోపైలట్ విభాగంలో ఇటీవల వందలాది ఉద్యోగులను తొలగించింది. ఆర్ధిక మందగమనం కారణంగానే ఈ చర్యలు చేపట్టామని ఎలన్ మస్క్కు చెందిన టెస్లా తెలిపింది. కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నా ఆర్ధిక మందగమనంతో టెక్ కంపెనీలు ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి.
మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ ఇటీవల పలు ప్రాంతాల్లోని 1800 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. వ్యవస్ధాగత సర్ధుబాట్లలో భాగంగా ఈ చర్యలు చేపట్టామని కంపెనీ చెబుతోంది. నియామక ప్రక్రియ మాత్రం యథాతథంగా కొనసాగిస్తామని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది.
నెట్ఫ్లిక్స్
స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ సబ్స్క్రైబర్ల సంఖ్య తగ్గిపోవడం, రాబడి గణనీయంగా పడిపోవడంతో రెండు విడతలుగా 450 మంది ఉద్యోగులను సాగనంపింది. ఈ ఏడాది చివరిలో మరింత మంది ఉద్యోగులపై వేటు వేస్తామని నెట్ఫ్లిక్స్ వెల్లడించింది.
ట్విట్టర్
ప్రపంచవ్యాప్తంగా హైరింగ్ను నిలిపివేసిన మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ టాలెంట్ అక్విజిషన్ టీంలో 30 శాతం సిబ్బందిని తొలగించినట్టు సమాచారం. విధుల నుంచి తొలగించిన ఉద్యోగులకు ట్విట్టర్ రిలీఫ్ ప్యాకేజ్ను ఆఫర్ చేసిందని చెబుతున్నారు.
టెస్లా
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్కు చెందిన టెస్లా ఇటీవల తన ఆటోపైలట్ విభాగంలోని 229 మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఆర్ధిక వ్యవస్ధ అద్వాన్నంగా ఉందని వెల్లడించిన మస్క్ ఉద్యోగుల్లో పది శాతం మందిపై వేటు తప్పదని ఈ ఏడాది జూన్లో సంకేతాలు పంపారు. ఇక ఆర్ధిక మందగమనం నేపధ్యంలో నియామకాల ప్రక్రియను కూడా కంపెనీ నిలిపివేసింది.