న్యూఢిల్లీ: కరోనా కల్లోలంతో దేశం ఓవైపు సతమతం అవుతుంటే మోసగాళ్లు మరోవైపు అమాయకులపై రకరకాల ట్రిక్కులు ప్రయోగహించి వారి ఖాతాల్లోని సొమ్మును లాగేసుకుంటున్నారు. ఒకసారి సొమ్ము పోయిన తర్వాత వారిని పట్టుకోవడం దాదాపు అసాధ్యం. సాధారణంగా సాయం అందిస్తామనో, లాటరీ వచ్చిందనో వలలో వేసుకుని మోసాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో మూడు ప్రధాన బ్యాంకులైన ఎస్బీఐ, పీఎన్బీ, ఐసీఐసీఐ తమ ఖాతాదారులను అప్రమత్తం చేశాయి.
ఎస్బీఐ
డబ్బు పంపిస్తామనేవారి క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేయొద్దని ఎస్బీఐ తన ఖాతాదారులను హెచ్చరించింది. డబ్బు పంపడానికి తప్ప అందుకోవడానికి ఎలాంటి క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేయాల్సిన అవసరం ఉండదని గుర్తు చేసింది. ఇందుకు సంబంధించి ఓ వీడియోను కూడా విడుదల చేసింది.
పీఎన్బీ
మరో పబ్లిక్ రంగం బ్యాంకు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫేక్ కాల్స్, ఎస్సెమ్మెస్ గురించి ఖాతాదారులను హెచ్చరించింది. మోసగాళ్లు తప్పుదారి పట్టించేందుకు చూస్తారని, అలాంటివి నమ్మవద్దని తెలిపింది.
ఐసీఐసీఐ
కాగా ప్రైవేటు రంగం దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకింగ్ లేదా మరే ఇతర ఆర్థిక సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించింది. బ్యాంకు సిబ్బంది ఎలాంటి ఆర్థిక సమాచారాన్ని ఫోన్ లేదా ఎస్సెమ్మెస్ ద్వారా అడుగబోరని స్పష్టం చేసింది. కేవలం మోసగాళ్లు మాత్రమే ఫోన్లలో అలాంటి సమాచారాన్ని తెలియజేయమని అడుగుతారని తెలిపింది.