వాషింగ్టన్: ఈ ఏడాది జూలై నాలుగవ తేదీ నాటికి ప్రతి అమెరికా పౌరుడు వ్యాక్సిన్ తీసుకోవాలని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఒకవేళ దేశమంతా వ్యాక్సిన్ తీసుకుంటే.. జూలై నాలుగవ తేదీన కోవిడ్ నుంచి మనకు స్వాతంత్య్రం వచ్చినట్లే అని ఆయన తెలిపారు. ప్రతి ఏడాది అమెరికా స్వాతంత్య్ర దినోత్సవానికి జూలై నాలుగవ తేదీని నిర్వహిస్తారు. దేశ ప్రజలను ఉద్దేశించి బైడెన్ ప్రసగించారు. మే ఒకటో తేదీ నాటికి ప్రతి రాష్ట్రంలో ఉన్న వయోజనులు టీకాలు తీసుకోవాలని బైడెన్ సూచించారు. ప్రస్తుతం వయసు, ఆరోగ్యం షరతుల ఆధారంగా టీకాలు ఇస్తున్నారు. కరోనా వైరస్ను మహమ్మారిగా ప్రకటించి ఏడాది ముగుస్తున్న నేపథ్యంలో అధ్యక్షుడు బైడెన్ ఈ విషయాలను తెలిపారు. 5 లక్షల కన్నా ఎక్కువ మంది అమెరికన్లు వైరస్తో చనిపోయినట్లు ఆయన చెప్పారు. గత ఏడాది మార్చిలో కరోనా కేసులు మొదలవ్వడంతో.. అమెరికాలో అన్ని మెగా క్రీడా ఈవెంట్లను రద్దు చేశారు. హీరో టామ్ హ్యాంక్స్ తనకు కరోనా వచ్చినట్లు ప్రకటించారు. ఆ తర్వాత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యూరోప్ నుంచి ప్రయాణాలను రద్దు చేసిన విషయం తెలిసిందే.
దేశ ప్రజలంతా వ్యాక్సిన్ తీసుకుంటే.. ప్రతి ఒక్కరూ సంబరాలు చేసుకునే సందర్భం వస్తుందని బైడెన్ అన్నారు. అందరం టీకా వేసుకుంటే, జూలై 4వ తేదీన బంధుమిత్రులతో సంబరాలు చేసుకోవచ్చు అని, మనం స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే ఛాన్సు ఉందని ఆయన అన్నారు. ఇది కేవలం ఇండిపెన్డెన్స్ డే మాత్రమే కాదు అని, వైరస్ నుంచి కూడా మనం స్వాతంత్య్రం పొందినట్లే అని ఆయన తెలిపారు. వ్యాక్సిన్ ఇచ్చే ప్రాంతాలను కూడా పెంచనున్నట్లు బైడెన్ వెల్లడించారు. 10 కోట్ల మందికి తొలి వంద రోజుల పాలనలోనే టీకాలు ఇవ్వాలని బైడెన్ టార్గెట్ పెట్టుకున్నారు. కానీ ఆ లక్ష్యాన్ని కేవలం 60 రోజుల్లోనే చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోషల్ డిస్టాన్స్ పాటించాలని, చేతులు కడుక్కోవాలని, ఎప్పుడూ మాస్క్లను ధరించాలంటూ ఆయన సూచన చేశారు.