హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఘనంగా జరిగాయి. నగరంలోని అశోక్నగర్లో గల తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో హోంమంత్రి మహమూద్ అలీ కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా 30 మంది విద్యార్థినులకు సైకిళ్లు, ఆరుగురు దివ్యాంగులకు స్కూటీల పంపిణీ చేశారు.
కవితపై ప్రత్యేక గీతం ఆవిష్కరణ..
ఎమ్మెల్సీ కవితపై తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజీవ్ సాగర్ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక గీతాన్ని హోంమంత్రి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. తెలంగాణ పల్లె పండుగ బతుకమ్మను విశ్వవ్యాప్తం చేయడంలో కవిత కృషి ఎనలేనిదన్నారు. తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయల గురించి అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో సైతం కీలక పాత్ర పోషించిన విషయాన్ని గుర్తుచేశారు.
జాగృతి, టీఆర్ఎస్ కార్యకర్తల రక్తదానం..
కవిత పుట్టినరోజును పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 150 మంది తెలంగాణ జాగృతి, టీఆర్ఎస్ కార్యకర్తలు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, సాట్స్ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు దేవీ ప్రసాద్, మర్రి రాజశేఖర్ రెడ్డి, తలసాని సాయి కిరణ్,యాదవ్ తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజీవ్ సాగర్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి , హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు అనంతుల ప్రశాంత్ పాల్గొన్నారు.