కాంగ్రెస్లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జీ 23 సమావేశానికి హాజరైన సీనియర్ నేత భూపేందర్ సింగ్ హుడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్తో భేటీ అయ్యారు. హర్యానాలో పార్టీ పరిస్థితి, తీసుకునే చర్యలపై చర్చించారని సమాచారం వస్తున్నా… ముఖ్యంగా జీ 23 నేతలు మాట్లాడుకున్న విషయాలే వీరిద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చాయని ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాహుల్తో భేటీ ముగిసిన వెంటనే భూపేందర్ హుడా జీ 23 గ్రూపులో ముఖ్యుడు, సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ఇంటికి వెళ్లారు. ఆజాద్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో మరో సీనియర్ నేత ఆనంద్ శర్మ కూడా పాల్గొన్నారు. పార్టీ పరిస్థితులు, అధిష్ఠానం దృష్టికోణాన్ని హుడా ఈ ఇద్దరికీ వివరించినట్లు తెలుస్తోంది. అయితే భూపేందర్ సింగ్ నడిపిన రాయబారం సఫలమైనట్లే తెలుస్తోంది. అతి త్వరలోనే గులాంనబీ ఆజాద్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాతో భేటీ కాబోతున్నారని సమాచారం.
కాంగ్రెస్లో తలెత్తిన అలజడిని చల్లార్చడానికి కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవంతో కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇదే సమయంలో అసమ్మతి నేతలు కూడా విమర్శలు చేస్తే… పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యే అవకాశాలున్నాయని పార్టీ గ్రహించింది. దీంతో ఉపశమన చర్యలకు అధిష్ఠానం ఉపక్రమించింది.
ఐదు రాష్ట్రాల ఘోర పరాభవం తరువాతి పరిస్థితులు, సంస్థాగత మార్పులు, పార్టీ బాధ్యతలు ఎవరెవరికి ఇస్తే బాగుంటుంది? ఐదు రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిని అధ్యయనం చేయడానికి అధిష్ఠానం ఐదుగురిని నియమించింది. రజనీ పాటిల్ (గోవా), జయరాం రమేశ్ (మణిపూర్), అజయ్ మాకెన్ (పంజాబ్), జితేంద్ర సింగ్ (యూపీ), అవినాశ్ పాండే (ఉత్తరాఖండ్). వీరికి ఈ రాష్ట్రాల బాధ్యతలను అప్పగించింది కాంగ్రెస్ అధిష్ఠానం. దీని తర్వాత సీనియర్ నేత ఆజాద్ అధ్యక్షురాలు సోనియాతో భేటీ కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ చర్య ల ద్వారా కాంగ్రెస్లో వచ్చిన తుపాన్ను చల్లార్చడానికి అధిష్ఠానం తీవ్రంగా యోచిస్తున్నట్లు తెలుస్తోందని ఢిల్లీ నేతలు అంటున్నారు.