మంగపేట, మార్చి30: రాజుపేట సమీపంలోని లక్ష్మీనర్సాపురంలో వెలిసిన శ్రీనాగులమ్మ ఆలయం వద్ద మంగళవారం జాతర మొదలైంది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నాగులమ్మ తల్లి జెండాలు, పూజా సామగ్రి, గజ్జెలు, దేవర కుండలకు గోదావరి జలాలు, పసుపు, కుంకుమతో మేల్కొలు పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ దేవతకు పూజలు చేశారు. తెల్లవారు జామున 3 గంటలకు పూజారులు, వడ్డెలు, గిరిజన కుల పెద్దలు మండెమెలుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతర మేనేజింగ్ ట్రస్ట్ అధ్యక్షుడు బాడిశ రామకృష్ణస్వామి, ప్రధాన పూజారి నాగరమేశ్ ఆధ్వర్యంలో గిరిజన సంప్రదాయ ప్రకారం పూజలు నిర్వహించారు. కరోనా కారణంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు జాతరకు అనమతి లేదని జాతర నిర్వాహణ కమిటీ ప్రతినిధులు తెలిపారు.