శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీభ్రమరాంబాదేవికి వార్షిక కుంభోత్సవం (సాత్వికబలి) శాస్త్రోక్తంగా జరిగింది. ఈఓ కేఎస్ రామారావు ఆధ్వర్యంలో తెల్లవారుజామున గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భ్రమరాంబాదేవికి ఏకాంతంగా ప్రాత:కాల పూజలు చేశారు.
నవావరణ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర కుంకుమార్చన, పారాయణలు నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాకారాన్ని మొత్తం నిమ్మకాయల దండలతో అలంకరించి ఆస్థాన రజకునిచే శ్రీచక్రం వద్ద స్థలశుద్ధి చేయించి ముగ్గులు వేయించారు.
అనంతరం 21 కేజీల పసుపు 21 కేజీల కుంకుమలతో ఆలయ కార్యనిర్వాహణాధికారి అమ్మవారికి శాంతి ప్రక్రియ పూర్తిచేశారు. ఆ తరువాత గుమ్మడి కాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలో అమ్మవారి ఆలయ సింహ మండపం వద్ద సాత్విక బలి సమర్పించారు.
ఆలయ సాంప్రదాయానికి భంగం కలుగకుండా కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులకు దర్శనం కల్పించారు. సాయంత్రం అమ్మవారి అంతరాలయంతోపాటు సింహమండపంవద్ద టన్నులకొద్ది వండిన అన్నం పెసరపప్పుతో కుంభరాశులు పోసి పిండి దీపాన్ని వెలిగించిన తరువాత మల్లికార్జున స్వామివారికి ప్రదోషకాల పూజలు, అన్నాభిషేకం, మహామంగళహారతి ఇచ్చారు.
అనంతరం ఉత్సవ మూర్తులను పల్లకిపై ఆలయ ప్రదక్షిణ చేయించారు. అమ్మవారి ఉగ్రరూప కిరణాలు స్వామివారిపై సోకకుండా స్వామివారి లింగరూపానికి ఉల్లిపాయలు, జిలకర్ర, శొంఠిపోడితో కలిపిన పెరుగన్నం, భక్షంతో కప్పి ఉంచుతారని ప్రధాన అర్చకుడు భద్రయ్య తెలిపారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డితోపాటు ఆలయ ఏఈఓలు, పీఆర్డీ, సీఎస్ఓ, రెవెన్యూ, పోలీసులు పాల్గొన్నారు.
స్వామివారి ఆలయ ప్రవేశ ద్వారంలో విధులు నిర్వహిస్తున్న మల్లారెడ్డి సంప్రదాయం ప్రకారం 45 రోజుల దీక్షలో ఉండి శుక్రవారం సాయంత్రం స్త్రీవేషధారణలో అమ్మవారి ఆలయానికి చేరుకోగా ప్రధాన అర్చకులు మార్కండేయశర్మ, మణి పూజారి, విజయ్ కుమార్ ఆలయ ద్వారాలు తెరిచి అమ్మవారికి కుంభ హారతి ఇచ్చారు.
144 సెక్షన్ అమలులో ఉన్నందున సాయంత్రం రెండో విడత సాత్విక బలి అనంతరం పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతించారు. అనంతరం పున:పూజలు నిర్వహించి పలు రకాల పిండి వంటలతో మహా నివేదన చేసి ఆలయ ద్వారాలు మూసివేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.