నాగర్కర్నూల్: చెంచుల ఆరాధ్యదైవమైన భౌరపూర్ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి కల్యాణ మహోత్సవం మహాశివరాత్రి పర్వదినాన కనుల పండువగా జరిగింది. ఈ కల్యాణోత్సవానికి ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, జిల్లా కలెక్టర్ యల్.శర్మన్ దంపతులు సతీ సమేతంగా పాల్గొన్నారు.
రాష్ట్రంలోని నలుమూలల నుంచి చెంచులు భారీగా తరలి వచ్చారు. వారి సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం చెంచు పూజారులు మల్లయ్య, కోటయ్య వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
పెండ్లి కుమార్తె తరఫున ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు దంపతులు, పెండ్లి కొడుకు తరఫున కలెక్టర్ దంపతులు పాల్గొని ఎదుర్కోళ్లు నిర్వహించారు. చెంచులు సంప్రదాయబద్దంగా తప్పెట్లు తదితర మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి కల్యాణ కట్టపై కల్యాణం నిర్వహించారు.
అచ్చంపేట లింగాల మండలంలోని నల్లమల్ల కీకారణ్యంలో నెలకొని ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి పురాతన ఆలయంలో కల్యాణోత్సవం నిర్వహించుకోవడం చెంచుల సనాతన సంప్రదాయం.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే కల్యాణ మహోత్సవంలో పాల్గొనటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. చెంచులు ఆయురారోగ్యాలతో జీవించాలని భగవంతుడిని ప్రార్థించానని తెలిపారు. అంతకు ముందు కలెక్టర్ దంపతులు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ దంపతులు పురాతన ఆలయంలో స్వామి వారిని దర్శించుకోగా చెంచు పూజారులు స్వామి వారి శేష వస్త్రాలను బహుకరించి ఆశీర్వదించారు.