టైటిల్స్ సినిమా సక్సెస్లో సగ భాగం అవుతాయనే సంగతి మనందరికి తెలిసిందే. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి మేకర్స్ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా సినిమాలకు ముందు ఒక టైటిల్ అనుకుంటారు. తర్వాత ఆ టైటిల్ను మార్చేస్తుంటారు. అలాంటిదే పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమా టైటిల్ విషయంలోనూ జరిగిందట. ఈ చిత్రం మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోశియమ్’కు రీమేక్గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న భీమ్లా నాయక్ చిత్రంకు. స్క్రీన్ ప్లే, మాటలను ప్రముఖ రైటర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తున్నారు. ఇందులో రానా దగ్గుబాటి కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. జనవరి 12న విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించిన ప్రకటన కూడా చేశారు. అయితే సెట్స్లోకి వెళ్లక ముందు ఈ సినిమాకు ‘అసుర సంధ్యవేళలో..’ అనే టైటిల్ను అనుకున్నారు. అయితే పవన్కళ్యాణ్కు ఉన్న మాస్ ఇమేజ్ దృష్ట్యా ఆ టైటిల్ ఆడియెన్స్కు అంతగా కనెక్ట్ కాదేమోనని నిర్మాతలు భావించటంతో చివరకు టైటిల్ను ‘భీమ్లా నాయక్’గా ఖరారు చేశారు.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్, నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. పవన్ కళ్యాణ్ జోడీగా నిత్యామీనన్, రానా దగ్గుబాటి జోడీగా సంయుక్తా మీనన్ నటించారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి మూడు పాటలు, గ్లింప్స్, ప్రోమోలు విడుదలై మంచి ఆదరణను దక్కించుకున్నాయి.