అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, మరియు స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో శంకరనేత్రాలయ యుఎస్ఏ అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి ఆధ్వర్యములో పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 150 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకువస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
డాదాపు ఒక సంవత్సరం పాటు జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఎంతో మంది సినీ ప్రముఖులు, 33 దేశాల తెలుగు సంస్థల నాయకులు మరియు తెలుగేతర ప్రముఖులు పాల్గొన్నారని బాల గారు తెలిపారు. గత 6 నెలలుగా రత్నకుమార్ (సింగపూర్) మరియు ఘంటసాల కుటుంబ సభ్యుల సహకారం చాలా ఉందని తెలియజేశారు. ఇందులో భాగంగా యుఎస్ఏ నుంచి ప్రముఖ గాయకుడు, రచయిత ఫణి డొక్క వ్యాఖ్యాతగా 2022 జులై 24 నాడు అంతర్జాల (Zoom) కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
దీనికి ముఖ్య అతిథిగా హాజరైన నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, (హైదరాబాద్, తెలంగాణ ఇండియా) వందేమాతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. అమరగాయకుడు, సంగీత దర్శకుడు, పదివేలకు పైగా పాటలు పాడి భారతదేశం గర్వించదగినటువంటి మహాగాయకుడు ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని ఎందరో కళాకారులు ఆకాంక్షతో తాను ఏకీభవిస్తూ, భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నట్లు తెలిపారు. ఘంటసాలగారికి భారతరత్న ఇవ్వాలంటూ చేస్తున్న అభిప్రాయం సేకరణ ఉద్యమం ఫలప్రదం కావాలని మనసారా కోరుకుంటున్నట్లు చెప్పారు.
మరొక విశిష్ట అతిథి ప్రముఖ గాయకుడు, నటుడు (హైదరాబాద్, ఇండియా) డాక్టర్ గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఘంటసాల గురించి మాట్లాడే అర్హతగాని, వారి గాన వైభవాన్ని గురించి చర్చించే అంత శక్తి గాని లేదన్నారు. కానీ ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి గాయకుడికిగా, సంగీత విద్వాంసుడాగానే కాకుండా, స్వాతంత్ర సమరయోధుడిగా తాను ఘంటసాలను పూజిస్తానని చెప్పారు. వారు కేవలం ఒక సినీ గాయకుడేకాకుండా అనేక సామజిక అంశాల మీద గానం చేయడం జరిగిందన్న విషయాన్ని గుర్తుచేశారు. వారి గానం గాంధర్వ గానమని, ఈరోజు చాలా మంది వారిని అనుసరిస్తున్నారని, అనుకరిస్తున్నారని తెలియజేశారు. అనుకరణకి, అనుసరణకి కూడా అందని ఒక దివ్యమైన మహోన్నత గానం ఘంటసాలదని కొనియాడారు. వారు చనిపోయి 50 సంవత్సరాలు అయినా కానీ వారి పాటలతో అనేక మంది వైద్యం కన్నా గొప్ప చికత్సను పొందుతున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్వాహుకులు చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తూ ఆ మహనీయదుకి భారతరత్న గౌరవం దక్కాలని కోరుకున్నారు.
వీరితోపాటు ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్, నంది అవార్డు గ్రహీత (చెన్నై, ఇండియా) గోపిక పూర్ణిమ మాట్లాడుతూ.. మహాగాయకులు, సంగీత దర్శకులు ఘంటసాల వారిని భారతరత్న పురస్కారంతో సత్కరించాలనే ఆశయం కోసం కృషిచేస్తున్న దాదాపు 33 దేశాల తెలుగు సంఘాల ప్రతినిధులకు కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలిపారు. అలాగే నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు (హైదరాబాద్, ఇండియా) సాకేత్ కోమండూరి మాట్లాడుతూ.. మనందరికీ ఎంతో ఇష్టమయిన మన ఘంటసాల మాస్టారి శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా భారతరత్న పురస్కారం కోసం మీరందరు కృషి చేయడం చాలా సంతోషం అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహుకులు చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తూ ఆ మహనీయుడికి భారతరత్న గౌరవం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.
2004 నుంచి 2009 వరకు అప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్సార్కు పర్సనల్ సెక్రటరీగా ఉన్న భాస్కర శర్మ ఈ కార్యక్రమానికి గౌరవ అతిధిగా వచ్చారు. భగవద్గీత వినగానే మనకు బాగా వెంటనే గుర్తుకొచ్చేది ఘంటసాల అని చెప్పిన ఆయన… వారి తరువాత ఎంతమంది భగవద్గీతని ఆలపించినా కానీ ఘంటసాల గారు తన భగవద్గీతతో మనందరి మీద చెరగని ముద్ర వేశారని కొనియాడారు. వారికి అతిత్వరలోనే భారతరత్న లభించాలని ఆకాంక్షించారు సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ. రత్న కుమార్ కవుటూరు మాట్లాడుతూ ఇప్పటిదాకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న 33 దేశాల సంస్థలను, వాటి సహకారానికి ధన్యవాదములు తెలియచేసారు.
యుఎస్ఏ నుండి శంకర నేత్రాలయ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సభ్యులు ఆనంద్ దాసరి (డల్లాస్), రవి రెడ్డి మరకా (నెవార్క్), టీఎఎస్సీ అధ్యక్షుడు రావు కల్వకోట (లాస్ ఏంజిల్స్), అకాడమీ ఆఫ్ కూచిపూడి డాన్స్ రవి మరియు శశికళ పెనుమర్తి (అట్లాంటా), భారతదేశం నుంచి ఆసియా పసిఫిక్ ఇంక్ సీఈవో, సత్యప్రసాద్ సిద్దవటం (హైదరాబాద్, ఇండియా), 1974లో మచిలీపట్నంలో స్థాపించిన బ్యాంక్ ఆఫ్ శ్రీ ఘంటసాల వి.ఆర్. హరీష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఘంటసాల పాటలపై తమకున్న అభిమానాన్ని, వారి పాటలలోని మాధుర్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఘంటసాలకి భారతరత్న దక్కకపోవడం చాలా బాధాకరమని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15 కోట్ల మంది తెలుగువారి ఆత్మగౌరవం అని అభిప్రాయపడ్డారు. ఘంటసాలను కేంద్ర ప్రభుత్వం తగిన రీతిలో గుర్తించి భారతరత్న అవార్డుతో సత్కరించాలి అని అందరూ ముక్తకంఠంతో కోరారు. అందుకు విదేశాలలో నివసిస్తున్న తెలుగు సంస్థలతో పాటు తెలుగేతర సంస్థలను కూడా అందరిని ఏకతాటిపై తెచ్చి భారతరత్న వచ్చేంతవరకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు.
ఈ బృహత్ కార్యక్రమంలో ఇప్పటివరకు అమెరికాలోని పలు తెలుగు జాతీయ సంస్థల సహకారంతో, భారతదేశం నుంచి పలువురు ప్రముఖులతో పాటు జర్మనీ, నెదర్లాండ్స్, తైవాన్, ఐర్లాండ్, జపాన్, స్విట్జర్లాండ్, నైజీరియా, స్కాట్లాండ్, డెన్మార్క్, ఉగాండా, సౌదీ అరేబియా, హంగేరి, బ్రూనై, బోత్సువాన, మారిషస్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికాలోని పలు తెలుగు సంస్థలతో 150 టీవీ కార్యక్రమాలు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు.
ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్య స్పందన లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను https://www.change.org/BharatRatnaForGhantasalaGaru వెబ్సైటులో చూడవచ్చని చెప్పారు. ఎవరైనా ఈ కార్యక్రమానికి సహాయం చేయాలనుకుంటే ghantasala100th@gmail.com మెయిల్కు వివరాలు పంపాలని కోరారు.