హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ)/ బేగంపేట్ జూన్ 28: దివంగత భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 101వ జయంతి వేడుకలు మంగళవారం నెక్లెస్రోడ్లోని పీవీ జ్ఞానభూమిలో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, మహమూద్అలీ, మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, దయానంద్, జనార్దన్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి, హైకోర్టు జడ్జి ఎన్వీ శ్రవణ్కుమార్ పీవీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు.
వీరితో పాటు కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ నేతలు బండి సంజయ్, వివేక్, రాంచందర్రావు, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, కాంగ్రెస్ నేతలు రేవంత్రెడ్డి, అంజన్కుమార్యాదవ్, వీ హనుమంతరావు నివాళులు అర్పించినవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ పీవీ తన పరిపాలనా దక్షతతో దేశ గౌరవాన్ని ఇనుమడింపజేశారని, ఆయనకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలుగు బిడ్డ అయిన పీవీని కేంద్రం విస్మరించడం బాధాకరమని చెప్పారు.
పీవీ శతజయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఏడాది పొడవునా వేడుకలు నిర్వహించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పీవీ కుమారుడు ప్రభాకర్రావు మనుమలు, కుటుంబ సభ్యులు, కార్పొరేటర్ సుచిత్ర పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీవీ జీవిత చరిత్రకు సంబంధించిన ఘట్టాలు, భజనలు, ప్రార్థనలు, సర్వమత ప్రార్థనలు, మెడికల్ క్యాంపు, ఉచిత ఆరోగ్య, రక్తదాన, వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఆ ఘనత పీవీకే దక్కుతుంది: గుత్తా, పోచారం
దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసిన ఘనత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకే దక్కుతున్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంగళవారం పీవీ 101వ జయంతి సందర్భంగా శాసనసభ ప్రాంగణంలోని లాబీహాల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరంవారు మాట్లాడుతూ దేశ ప్రజలంతా గౌరవించే అపరమేధావి పీవీ అని కొనియాడారు.
ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యంతో సతమతమవుతున్న తరుణంలో భారత ఆర్థిక వ్యవస్థ తట్టుకొని నిలబడేలా సంస్కరణలు ప్రవేశపెట్టారని తెలిపారు. పీవీ గొప్పతనం, దార్శనికత భవిష్యత్తుతరాలకు తెలియజేసేందుకు సీఎం కేసీఆర్ గత ఏడాది పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో శాసనమండలిలో ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్రావు, శాసనసభ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు, టీఆర్ఎస్ఎల్పీ కార్యదర్శి రమేశ్రెడ్డి, నల్లగొండ జడ్పీ ఫ్లోర్ లీడర్ పాశం రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.