హైదరాబాద్ : అమరగాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావుకు భారతరత్న ఇవ్వాలనే నినాదంతో శంకర నేత్రాలయ యూఎస్ఏ అధ్యక్షుడు బాల ఇందుర్తి విశేషంగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ఘంటసాల శత జయంతి సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో యూఎస్ఏ నుంచి శంకర నేత్రాలయ యూఎస్ఏ అధ్యక్షుడు బాల ఇందుర్తి ఆధ్వర్యంలో ఇప్పటివరకు 50 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి.. ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకువస్తున్నట్లు నిర్వాహుకులు తెలిపారు.
యూఎస్ఏ నుంచి నీలిమ గడ్డమణుగు వ్యాఖ్యాత గా 3 ఏప్రిల్ 2022 నాడు జరిగిన అంతర్జాల (zoom) కార్యక్రమంలో ప్రముఖ సినీ గేయ రచయత భువనచంద్ర, ఘంటసాల కుమార్తె శ్యామల ఘంటసాల ముఖ్యఅతిథులుగా పాల్గొని ఘంటసాల పాటలోని మాధుర్యం, దేశభక్తిని కొనియాడారు. శ్యామల ఘంటసాల మాట్లాడుతూ.. వారి నాన్నతో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తు ఎంతో భావోగ్వేదానికి లోనయ్యారు. అలాగే ఘంటసాల పేరును భారత ప్రభుత్వం ప్రచురించిన ‘సన్స్ అఫ్ సాయిల్’ పుస్తకంలో ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు అని పేర్కొందని తన వదిన కృష్ణకుమారి ఘంటసాల చెప్పారని, ఆ విషయం చాలామందికి తెలియదని వివరించారు.
నిర్వాహకుల కృషి ఫలించాలని ఆకాక్షించారు. బాల ఇందుర్తి మాట్లాడుతూ.. ఇప్పటివరకు 48 మంది భారతరత్న అవార్డు కి ఎంపిక అవ్వగా.. అందులో ఒక్క తెలుగువారికి కూడా దక్కకపోవడం బాధాకరం అని అన్నారు. శ్యామల ఘంటసాల వచ్చి ఈ సమావేశంలో పాల్గొనడం నిర్వాహుకులందరికి ఒక కొత్త ఉత్తేజాన్ని ఇచ్చిందని తెలిపారు. యూఎస్ఏ నుంచి న్యూస్ ఎడిటర్ అఫ్ ఇండియా ట్రిబ్యూన్ రవి పోనంగి, న్యూజిలాండ్ నుంచి న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ పూర్వ అధ్యక్షురాలు,ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్, శ్రీలత మగతల, ఆస్ట్రేలియా నుంచి తెలుగు అసోసియేషన్ అఫ్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు రుద్ర కొట్టు, ఇండోనేషియా నుంచి ఇండోనేషియా తెలుగు అసోసియేషన్ ఉపాధ్యక్షుడు శివరామ కృష్ణ బండారు తదితరులు పాల్గొని ఘంటసాల పాటలతో తమకున్న అభిమానాన్ని, వారి పాటలలోని మాధుర్యాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఘంటసాలకు భారత్న ఇవ్వాలని ముక్తకంఠంతో నినదించారు.
ఈ బృహత్ కార్యక్రమాన్ని పలు తెలుగు సంస్థలతో 53 టీవీ కార్యక్రమాలను నిర్వహించామని, ఈ టీవీ చర్చా కార్యక్రమాలకు ప్రపంచ దేశాలలోని తెలుగు సంఘాలకి అనుసంధాన కర్తగా సింగపూర్ నుంచి రత్న కుమార్ కవుటూరు, న్యూజీలాండ్ నుంచి శ్రీలత మగతల, ఆస్ట్రేలియా నుంచి ఆదిశేషు వ్యవహరిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రామనికి కావాల్సిన సహకారాన్ని ఘంటసాల కృష్ణ కుమారి అందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంకా ఉధృతం చేసి ప్రపంచ దేశాలలో నివసిస్తున్న తెలుగు వారందరిని సంఘటితం చేస్తున్నట్లు నిర్వాహుకులు తెలిపారు.