వింధ్యకు ఈవలి వైపున ఒక విద్యుల్లత… అభివృద్ధి కాంతులు విరజిమ్ముతూ… అరాజకీయపు చిమ్మ చీకటిని చీలుస్తూ! దక్కన్ పీఠభూమిపై దద్దరిల్లిన ఒక విజయ వికాస ధ్వని… భరతజాతి తాత్వికతను బోధిస్తూ… నీల్గే నియంతలను నిగ్గడించి నిలదీస్తూ! తెలంగాణ చేతనావర్తంలో అల్లంత ఎత్తున ఎగిసిన సామరస్య పతాక… సంక్షేమ సందేశాలను సంధిస్తూ… విచ్చుకత్తుల విద్వేషాన్ని ఎదిరిస్తూ! ప్రజాస్వామ్య భారత వినీలాకాశంలో మరో పొద్దు పొడిచింది. దాని పేరు… భారత్ రాష్ట్ర సమితి
‘ప్రపంచంలో నీవు ఆశిస్తున్న మార్పునకు నీవే ప్రతీక కావాల’న్న మహాత్ముడి మాటను నమ్మిన ఘన తెలంగాణ జన నేత కేసీఆర్, జాతి కోసం ఎత్తిన కత్తి బీఆర్ఎస్! ‘నేనురా నిగళాలు తెగద్రొబ్బి ఆకాశమంత యెత్తరచినాను… నేను వేస్తంభాల నీడలో నొక తెల్గు తోట నాటి సుమాలు దూసినాను’ అన్నట్టుగా వలస శృంఖలాలు బద్దలు కొట్టి తెలంగాణ తల్లిని చెర నుంచి విడిపించిన కేసీఆర్ ఇప్పుడు.. దేశాన్ని బాధల దైన్యం నుంచి, భావ దారిద్య్రపు దాస్యం నుంచి విముక్తం చేసేందుకు కంకణం కట్టుకున్నారు. ప్రతి ఒక్కడూ నాకెందుకు అనుకుంటే, తప్పును ప్రశ్నించే వాడెవ్వడు? ఒప్పును ప్రజ్వలింప చేసేదెన్నడు? అంటూ దట్టీ కట్టి ఒట్టు పెట్టుకున్నారు. ప్రజాస్వామిక ప్రవాహంలో పంచ రంగుల బతుకమ్మ తేలినట్టు, ఎదురుచూపుల జమ్మిచెట్టుపై కొత్త పాలపిట్ట వచ్చి వాలినట్టు.. టీఆర్ఎస్ జాతీయ పార్టీగా అవతరించింది!!
ప్రాంతీయ- జాతీయ విభేదాలు ఇక చెల్లే! ప్రాంతీయత, జాతీయత మధ్య ఉన్న మిథ్యా వైరుధ్యం ఇక పొల్లే! ఉత్తరాది- దక్షిణాది పోలికలు ఇక కల్లే! బీఆర్ఎస్… ప్రాంతీయ అస్తిత్వ పునాదుల నుంచి ఎదిగిన జాతీయ ఆకాంక్షల సౌధం. అణచివేతపై గెలిచిన ధిక్కార ఖడ్గం… ఆధిపత్యంపై రణానికి నిలిచిన తరుణం. ఇది సకల జాతులను, సర్వ మతాలను, సబ్బండ వర్ణాలను, భారత సోదరులందరి ఆశలను ఆశయాలను కలుసుకుంటూ, కలుపుకొంటూ సాగే సమ్మిళిత, సమైక్యతా ప్రగతి గంగ!
‘కారే రాజులు, రాజ్యముల్ గలుగవే గర్వోన్నతింబొందరే.. వారేరీ సిరి మూట గట్టుకొని పోవంజాలిరే, భూమిపై బేరైనంగలదే…’ అన్నట్టుగా ఎందరో నాయకులు రానూ వచ్చారు. పోనూ పోయారు. కానీ కాలాన్ని శాసించి, ప్రగతిని శ్వాసించి, భవిష్యత్తును ఆశించి, వర్తమానాన్ని పోషించిన వారెందరు? కర్మఫలం ఆశించకుండా ధర్మాన్ని నిర్వర్తించి, చరిత్రపై చెరగని ముద్ర వేసింది ఎందరు? అలా చేసిన అతి కొద్దిమందిలో ఒకరైన కేసీఆర్.. ఇప్పుడు తెలంగాణ సిరాతో భారత ప్రగతి పర్వాన్ని రచించబోతున్నారు.
నాయకుడు పాత దారిలో నడవరు. కొత్తదారులు వేస్తారు. జనాన్ని తన బాటలో నడిపిస్తారు. విద్వేషాగ్నులు రగిలే దేశానికి ఇప్పుడొక శాంతి ప్రవక్త అవసరం. దారిద్య్రపు శృంఖలాలు తెంచడానికి దార్శనికుడు అవసరం. భారత భూమి పుత్రుడిగా తన కర్తవ్య నిర్వహణ కోసం కేసీఆర్ కార్యరంగంలోకి దూకారు. ఆ మహా ప్రస్థానంలో మనమూ వెంట నడుద్దాం!
‘ఇంతింతై వటుడింతై… ’అంటూ వామనుడు భూమి, ఆకాశాలను ఆక్రమించుకొన్న అద్భుతాన్ని కండ్లకు కట్టినట్టు వర్ణించాడు మన మహాకవి పోతన. ఇప్పుడు అటువంటి మహా అద్భుతం మన కండ్ల ముందే సాక్షాత్కారమయింది. కరీంనగర్లో ‘సింహగర్జన’ చేసిన ఒక బక్కపలుచని మనిషి తన గుండె బలంతో, వ్యూహ చతురతతో బెదిరింపులకు వెరవక, అలరింపులకు కరుగక, ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తూ, తెలంగాణ ఆకాంక్షను సాకారం చేశారు. ఎనిమిదేండ్లుగా తెలంగాణ ముఖ్యమంత్రిగా, వికాసోద్యమ సారథిగా జాతీయ స్థాయిలో జాజ్వల్యమానంగా వెలుగులీనుతున్నారు. కేసీఆర్ దార్శనికతతో ‘తెలంగాణ మాడల్’ నేడు దేశానికి రోల్ మాడల్ అయింది. వివిధ రాష్ర్టాలలోని భిన్న వర్గాలవారు ‘దేశ్ కా నేతా కైసా హో కేసీఆర్ జైసా హో’ అని నినదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహా నాయకుడు కేసీఆర్ సారథ్యంలో జాతీయ రాజకీయ పక్షం – భారత్ రాష్ట్ర సమితి- ఆవిర్భవించింది. భారతావని చరిత్రలోనే ఇదొక అపూర్వ ఘట్టం.
కేసీఆర్ సాహసోపేత నిర్ణయాలు, కార్యాచరణ పరికించినప్పుడు చరిత్రను మలుపు తిప్పడానికే అవతరించిన కారణజన్ముడేమో అనిపిస్తుంది. ప్రపంచమంతా హింసాద్వేషాల అగ్నిగుండాలలో మరిగిపోతున్న తరుణంలో, మహాత్ముడి అహింసా సిద్ధాంతం బాటలో తెలంగాణ ఉద్యమాన్ని నడిపారాయన. 21వ శతాబ్దంలో శాంతియుత ఉద్యమాలకు కాలం చెల్లిందన్న అంచనాలను పూర్వపక్షం చేశారు. దీంతో పాటు పార్లమెంటరీ పంథాలోనే మన ఆకాంక్షలను నెరవేర్చుకోవచ్చుననే ధైర్యాన్ని ప్రజలకు నూరిపోసారు. ఎవరెన్ని అవాంతరాలు సృష్టించినా, అభాండాలు వేసినా తాను నమ్మిన బాటను వీడకుండానే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన శక్తిత్వం కేసీఆర్ది. కేసీఆర్ అసాధారణ వ్యక్తిత్వం, కార్యశీలత్వం మూలంగా విద్యా వంతులకైతేనేమి, సామాన్య ప్రజలకైతేనేమి రాజకీయాల పట్ల విశ్వాసం కలుగుతున్నది. ప్రజాస్వామ్య రాజకీయాలను పునర్నిర్వచించిన రాజనీతి కోవిదుడు కేసీఆర్.
కష్టపడి సాధించిన తెలంగాణ రాష్ట్రం స్వార్థ శక్తుల కుట్రలకు కకావికలం కాకూడదనే బాధ్యతాయుత ఆలోచనే కేసీఆర్ను రాష్ట్ర సారథ్యం చేపట్టేలా పురికొల్పింది. ఉద్యమనేతగా ఎంత నిజాయితీగా, అచంచలంగా వ్యవహరించారో, ముఖ్యమంత్రిగానూ అంతే చిత్తశుద్ధితో, సమర్థతతో రాష్ర్టానికి కొత్త దారి చూపారు. అందుకే మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు- దేనిలో అయినా కేసీఆర్ ముద్ర బలంగా కనిపిస్తున్నది. మారుమూల గిరిజన తండాలతో సహా ఇంటింటికీ శుద్ధమైన నీరు అందించిన తీరు ప్రజలపై ఆయనకున్న అవ్యాజ అనురాగానికి అద్దం పడుతుంది. దీనివల్ల మంచినీటి సమస్య తీరడమే కాకుండా పేదలు కలుషిత జలం తాగి రోగాల పాలు కాకుండా కాపాడినట్టయింది. అత్యల్ప కాలంలోనే కాళేశ్వరం వంటి బృహత్ ప్రాజెక్టును నిర్మించి భూమాతకు పచ్చని కోక కప్పారు. రైతులకయితే వ్యవసాయమంటేనే పండుగలా మారింది. పంటకాలం వస్తే చాలు, పల్లెపల్లెనా వాకిళ్లలో వడ్ల రాసులు కనిపిస్తున్నాయి. బిక్కుబిక్కుమంటూ గడిపిన కులవృత్తుల వారూ గర్వంగా తలెత్తుకొని బతుకుతున్నారు. వ్యవసాయం, గ్రామీణం, నగర జీవనం, పారిశ్రామికం ఏ రంగం చూసినా విప్లవాత్మక మార్పులకు లోనయ్యాయి. రాష్ర్టానికి పెట్టుబడుల ప్రవాహం పెరిగిపోయింది. రాష్ట్రం నుంచి వలస పోయే వారు లేకపోగా, ఇక్కడ కూలీలకు కొరత ఏర్పడి ఇతర రాష్ర్టాల నుంచి పిలిపించుకోవలసి వస్తున్నది. విద్యారంగంలో మన బిడ్డలు విజయ శిఖరాలను అధిరోహించారు. అన్ని రంగాలలోనూ రాష్ర్టానికి అవార్డులు లభిస్తున్నాయి. అత్యంత స్వల్ప కాలంలో ఏ ప్రధానీ, ముఖ్యమంత్రీ సాధించని అపూర్వ విజయాలివి. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ పరిపాలనా విధానమే ఒక అద్భుతం!
ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన ఈ అద్భుత పాలనే జాతీయ స్థాయిలో ఆయనను అగ్రగణ్య నాయకుడిగా నిలబెట్టింది. ఉప్పొంగే నదీజలాలు సముద్రం పాలవడమేమిటి? పసిడి భూములు బీడుపడి ఉండటమేమిటి? అంటూ ఆయన దేశ ప్రజలలో కొత్త ఆలోచనలు రేపారు. 1980 తరువాత చైనా సాధించిన అభివృద్ధిని ఉటంకిస్తూ, వారేమైనా బంగారం తింటున్నరా, మనమేమైనా మట్టి తింటున్నమా మనమెందుకు వెనుకబడ్డామంటూ ఆయన వేసిన ప్రశ్నతో మేధావుల మస్తిష్కంలో మథనం సాగుతున్నది. తెలంగాణ ఉత్తరాదికి, దక్షిణాదికి వారధి వంటిది. కేసీఆర్ ఆంగ్లం, హిందీ, ఉర్దూ తదితర భాషలను అనర్గళంగా మాట్లాడగల దిట్ట. ఆయనకు ఉత్తరాది బాధలూ తెలుసు, దక్షిణాది మనోభావాలూ తెలుసు. నిలువెల్లా విషం నింపుకొని విచ్చుకత్తులతో వచ్చిన వారిలోనూ విజ్ఞతను తట్టిలేపి మెప్పించగల నేర్పరి ఆయన. ప్రపంచ చరిత్రలోనే ఇటువంటి నాయకులు బహు అరుదు.
దేశం పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నది. ఆర్థికరంగంలో శ్రీలంక బాటలో నడుస్తున్నట్టు భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. విద్వేష రాజకీయాలు సమాజాన్ని కల్లోలభరితం చేస్తున్నాయి. పేదరికం, నిరుద్యోగం పెరిగిపోయాయి. అనాలోచిత నిర్ణయాలతో పారిశ్రామిక రంగం కుదేలయింది. పేదలు మరింత పేదలవుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు నిర్వీర్యమైపోతున్నాయి. భిన్నత్వంలో ఏకత్వమనే భావన బలహీనపడుతున్నది. ఈ ప్రమాదకర పరిస్థితులో దేశాన్ని చక్కదిద్దే కేసీఆర్ వంటి నాయకుడు కావాలనే భావన బలపడుతున్నది. ఈ పరిణామాలే జాతీయ పార్టీని ప్రకటించేలా కేసీఆర్ను ప్రేరేపించాయి. కేసీఆర్ వంటి ఉత్తమ నాయకుడిని దేశానికి అందిస్తున్నందుకు తెలంగాణ సమాజమంతా గర్వించదగిన సందర్భమిది. జాతీయ పార్టీ సంబురాల్లో అందరం భాగస్వాములం అవుదాం. రెండు దశాబ్దాలకు పైగా కేసీఆర్ను మన నాయకుడిగా గుర్తించి, అండగా నిలిచి, హారతి పట్టాం. ఇక ముందూ మనమంతా వెంట ఉంటామనే భరోసా ఇద్దాం.
– దీవకొండ దామోదర్రావు,
చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ – టీపీపీఎల్