ప్రగతిలో కార్పొరేటర్ల పాత్ర కీలకం
ఐదేళ్లలో పనితీరు అద్భుతం
మంత్రి పువ్వాడ అజయ్కుమార్
నగరంలో మాజీ కార్పొరేటర్ల అభినందన సభ
ఖమ్మం, మార్చి 28: టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి సహకారం అందించడం వల్లనే ఖమ్మం నగరాభివృద్ధి సాధ్యమైందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం నగరపాలక సంస్థలో ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న కార్పొరేటర్ల అభినంధన సభ నగరంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పాలకమండలి నగర ప్రజల కోసం ఈ ఐదేళ్లూ అద్భుతంగా పనిచేసిందని కితాబిచ్చారు. కార్పొరేటర్ల కృషి మరువలేమని, నగర సుందరీకరణలో అద్భుతంగా పనిచేశారని అన్నారు. ఖమ్మం అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లు ఎంతో సహకరించారన్నారు. ఒక్కో డివిజన్లో కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ చొరవతో నగరానికి అదనపు నిధులు సమకూరాయన్నారు.
ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు బద్నాం చేస్తున్న సందర్భంలోనూ ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్రెడ్డి గెలుపు కోసం అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. ప్రతిపక్షాలన్నీ ఏకమైనా ఏమీ చెయ్యలేని స్థితిలో ఖమ్మం టీఆర్ఎస్ బలోపేతమైందని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఖమ్మం కార్పొరేషన్లో భారీ విజయాన్ని టీఆర్ఎస్ సొంతం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు, పార్టీ గెలుపు, ప్రభుత్వ ప్రతిష్ట ముఖ్యమని కార్పొరేటర్లను ఉద్దేశించి అన్నారు. అనంతరం మాజీ కార్పొరేటర్లకు మెమెంటో అందచేశారు. శాలువాలతో సత్కరించారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, మాజీ మేయర్ డాక్టర్ జీ.పాపాలాల్, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ, మాజీ కార్పొరేటర్లు బత్తుల మురళీ, కమర్తపు మురళి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కాబోయే అమ్మలు.. టీకాలకు సిద్ధం!
మిరియాలతో బరువు ఎలా తగ్గవచ్చంటే..?