నిత్య నిరసనల నుంచి పురోభివృద్ధి వైపు పయనం
ఏళ్ల నాటి తాగునీటి సమస్య పరిష్కారం
తడి, పొడి చెత్త రీ సైక్లింగ్తో ఆదాయం
పకడ్బందీగా పారిశుధ్య పనులు
ఉత్తమ పంచాయతీగా గుర్తింపు
పల్లెప్రగతితో మారిన రూపురేఖలు
కొణిజర్ల, మార్చి 25: నిత్యం నిరసనలతో హోరెత్తిన గ్రామమది. వేసవి సమీపిస్తే చాలు.. ఖాళీ బిందెలతో గ్రామస్తులు రోడ్డెక్కి ఆందోళనలకు దిగడం, తాత్కాలిక ఉపశమనంగా ట్యాంకర్లతో నీటిని అందించి గ్రామస్తులను శాంతింపజేయడం అక్కడ నిత్యకృత్యంగా ఉండేది. వర్షాకాలం వస్తే విషజ్వరాలు విజృంభించేవి. రెండంకెల సంఖ్యలో మరణాలు నమోదయ్యేవి. ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితి మారింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లెప్రగతి కార్యక్రమంతో ఆ గ్రామ స్వరూపమే మారిపోయింది. వీధులన్నీ సీసీ రోడ్లుగా మారాయి. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు పల్లెప్రకృతివనం సర్వాంగ సుందరంగా తయారైంది. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న తాగునీటి సమస్య మిషన్ భగీరథతో పరిష్కృతమైంది. చివరి మజిలీ సాఫీగా సాగేందుకు వైకుంఠధామం, రాత్రిళ్లు సైతం పగటివేళను తలపించేలా వీధిలైట్లు, పచ్చదనం, పరిశుభ్రతతో పరిసరాలు, వీధుల వెంబడి ఏపుగా పెరిగిన చెట్లు ఆ గ్రామంలోకి వెళ్లేవారికి స్వాగతం పలుకుతున్నాయి. పంచాయతీ ద్వారా కొనుగోలు చేసిన ట్రాక్టర్తో మూడు రోజులకోసారి తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. తడి, పొడి చెత్త రీసైక్లింగ్తో కంపోస్టు ఎరువు తయారీపై ఆదాయం పొందేలా జిల్లాస్థాయి అధికారులు ఇటీవల శిక్షణ కూడా ఇచ్చారు. 30 రోజుల కార్యాచరణలో భాగంగా పాడుబడ్డ ఇళ్లను నేలమట్టం చేశారు. పాత బావులను పూడ్చివేశారు. మురుగునీరు సాఫీగా పారే కాలువలను ఏర్పాటు చేశారు. దీంతోపాటు పంచాయతీలో ఇప్పటి వరకు 80 శాతం ఇంటి పన్నులు వసూలయ్యాయి. ఉత్తమ పంచాయతీగా గుర్తింపు పొందింది. అదే.. కొణిజర్ల మండలం అమ్మపాలెం గ్రామం.
చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు
మిషన్ భగీరథ ద్వారా పంచాయతీ నిధులతో ఇంటింటికీ పైపులైన్ వేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలకు పువ్వాడ ఉదయ్నగర్ నుంచి రూ.7 లక్షల విలువైన గ్రావెల్ను తోలారు. ఇంటింటికీ ఇంకుడుగుంతలు నిర్మించారు. రూ.45 లక్షలతో సీసీ రోడ్లు నిర్మించారు. రాజమండ్రి సమీపంలోని కడియం నర్సరీ నుంచి తెప్పించిన పూలమొక్కలను ప్రధాన రహదారికి ఇరువైపులా నాటి సుందరంగా తీర్చిదిద్దారు. ఎల్ఈడీ బల్బులు మిరుమిట్లు గొలుపుతున్నాయి. వైకుంఠధామం, డంపింగ్యార్డు, పల్లెప్రకృతివనం, నర్సరీ వంటివి గ్రామస్తులకు అందుబాటులోకి వచ్చాయి. నూరు శాతం మరుగుదొడ్లు ఉన్నాయి.