కోల్కతా : పశ్చిమ బెంగాల్లోని భవానీపూర్ బీజేపీ నియోజకవర్గ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్ ఎన్నికల సంఘం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారంటూ టీఎంసీ చేసిన ఫిర్యాదు మేరకు ఈసీ నోటీస్ ఇచ్చింది. టిబ్రేవాల్ నామినేషన్ వేసే సమయంలో పెద్ద ఎత్తున జన సమీకరణ చేపట్టి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, కొవిడ్ సంబంధిత మార్గదర్శకాలు ఉల్లంఘించారని టీఎంసీ ఆరోపించింది. ఎలాంటి అనుమతి లేకుండా సుమారు 500 మంది సమీకరించారని, అలాగే నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లిన మార్గంలో ఆమె ‘ధునుచి నాచ్’ (సాంప్రదాయ బెంగాలీ నృత్యం.. సాదరణంగా దూర్గా పూజ సమయంలో చేస్తుంటారు)ను ప్రదర్శించారని పేర్కొంది.
అలాగే రిటర్నింగ్ అధికారి జారీ చేసిన నోటీస్లో భవానీపూర్ పోలీస్స్టేషన్ ఇన్చార్జి ఆఫీసర్ సమర్పించిన నివేదికను సైతం ప్రస్తావించింది. అయితే, ఈ ఆరోపణలను ప్రియాంక టిబ్రేవాల్ తోసిపుచ్చారు. ఉప ఎన్నికల్లో తాను పోటీ చేస్తుండడంతో టీఎంసీ భయపడుతోందని, తనను ప్రచారం చేయకుండా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిందని విమర్శించారు. ఈసీ నోటీసుకు సమాధానం ఇస్తానని తెలిపారు. అయితే, నామినేషన్ దాఖలు చేయడానికి తాను వెళ్లిన వాహనంలో సువేందు అధికారి మినహా ఎవరూ లేరన్నారు. బీజేపీ మద్దతుదారులు సొంత వాహనాల్లో వచ్చారని, నేను ఎలాంటి జన సమీకరణ చేపట్టలేదన్నారు. రోడ్లపై వాహనాల్లో ఎవరు ఉన్నారో చూడడం నా పని కాదని.. పోలీసులు, స్థానిక అధికారులదని పేర్కొన్నారు.