మెహిదీపట్నం:ఆన్లైన్,ఆఫ్లైన్లో పకడ్బందీగా బెట్టింగ్లు నిర్వహిస్తున్న ఓ బెట్టింగ్ ముఠాను శుక్రవారం నార్త్జోన్ టాస్క్పోర్స్ పోలీసులు రట్టు చేశారు. అనంతరం లంగర్హౌస్ పోలీసులకు అప్పగించారు. ఏడుగురు సభ్యులు గల ముఠాలో నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 8లక్షల65 వేల రూపాయల నగదు, ఓ స్విఫ్ట్ కారు, ఓ బైక్, ఓ లాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….లంగర్హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అహ్మద్ కాలనీ కేంద్రంగా ఆన్లైన్, ఆఫ్లైన్లలో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
ఈ మేరకు నార్త్జోన్ టాస్క్పోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి ఆ రాకెట్ గుట్టు రట్టు చేశారు.టాస్క్పోర్స్ డీసీపీ రాధాకిషన్రావు తెలిపిన వివరాల ప్రకారం…..బహదూర్ పురా వట్టేపల్లికి చెందిన సయ్యద్ జమీల్(28),కుల్సుంపురా ముస్తయిద్పురాకు చెందిన ఖాజా ఆసిమ్ అహ్మద్(28),టోలిచౌకి అహ్మద్ కాలనీకి చెందిన మహ్మద్ షెహబాజ్(29), రాజేంద్రనగర్ కిషన్బాగ్కు చెందిన ఆజంఖాన్(23),బహదూర్పురా వట్టేపల్లికి చెందిన సయ్యద్ అజహరుద్దీన్(35), సయ్యద్ జహీరుద్దీన్(32), మల్లేపల్లికి చెందిన తాహుద్దీన్లు ముఠాగా ఏర్పడి ఆన్లైన్లో గేమ్లకు బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు.
ఆన్లైన్లో తమ వెబ్సైట్తో బెట్టింగ్ ఆడే వారికి ప్రత్యేకంగా ఐడీలను రూపొందించి మరీ వీరు బెట్టింగ్ వ్యాపారం నిర్వహిస్తుండటం గమనార్హం. ఎంతో పకడ్బందీగా కొనసాగుతున్న వీరి బెట్టింగ్ గురించి సమాచారం అందుకున్న నార్త్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావు,ఎస్ఐలు శ్రీకాంత్,బి.అశోక్రెడ్డి,జి.శివానందంల బృందం దాడులు నిర్వహించి ఈ ముఠా గుట్టును రట్టు చేశారు.వీరి వద్ద నుంచి 8లక్షల65వేల రూపాయల నగదు,ఓ కారు,ఓ బైక్,ఓ ల్యాప్టాప్లతో పాటు అకౌంట్,రిజిస్టర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలోని సయ్యద్ అజహరుద్దీన్,సయ్యద్ జహీరుద్దీన్, తాహుద్దీన్లు పరారీలో ఉన్నారు.కేసు దర్యాప్తులో ఉంది.