హైదరాబాద్: రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాలు (ఎస్హెచ్జీ) బాగా పనిచేస్తున్నాయని పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీ ప్రశంసించింది. ఎస్హెచ్జీలు మొదట ప్రారంభమైంది తెలంగాణలోనేనని, అందుకే ఇక్కడ మహిళా సంఘాల పనితీరు, వారి స్వావలంబనకు చేపట్టిన కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇక్కడ పర్యటిస్తున్నామని కమిటీ చైర్పర్సన్ డాక్టర్ హీనా గవిత్ తెలిపారు. పార్లమెంటరీ కమిటీ రెండో రోజు పర్యటనలో భాగంగా మంగళవారం మహిళా సంఘాల పనితీరును తెలుసుకోవడానికి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా), స్త్రీ నిధి పరపతి సమాఖ్య అధికారులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఎస్హెచ్జీల పనితీరు, ఆర్థిక స్వావలంబన సాధించడానికి చేపడుతున్న కార్యక్రమాలను సెర్ప్ ఇన్చార్జి సీఈవో, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, మెప్మా మిషన్ డైరెక్టర్, సీడీఎంఏ ఎన్.సత్యనారాయణ, స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిటీకి వివరించారు. ఈ సందర్భంగా పార్లమెంటరీ కమిటీ సభ్యులు మహిళా సంఘం సభ్యులతోపాటు వీధి వ్యాపారులతో స్వయంగా మాట్లాడారు. వారి అభిప్రాయాలను, అనుభవాలను తెలుసుకున్నారు.
తెలంగాణలో మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున రుణాలను అందిస్తున్నారని పార్లమెంటరీ కమిటీ ప్రశంసించింది. మెప్మా పరిధిలో పట్టణ ప్రగతిలో భాగంగా వీధి వ్యాపారులకు రూ.357కోట్ల రుణాలను అందించినట్లుగా మెప్మా డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ తెలిపారు. వీధి వ్యాపారుల రిజిస్ట్రేషన్ ఇంత పెద్ద ఎత్తున ఏ విధంగా చేయించగలిగారు, వారికి రుణాలు ఏ విధంగా అందించగలిగారని కమిటీ చైర్పర్సన్ హీనా గవిత్ తెలుసుకున్నారు.
మరుగు దోడ్ల నిర్వహణను ఎస్హెచ్జీలకు అప్పగించడం, నిర్వహణ సమాచారాన్ని, ఫొటోలను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు సమాచారం పొందుపర్చడాన్ని ప్రశంసించారు. నర్సరీలు, డీఆర్సీల ఏర్పాటులో మహిళా సంఘాల భాగస్వామ్యం చేయడాన్ని కూడా కమిటీ అభినందించింది. స్త్రీనిధి ద్వారా రుణం కావాల్సిన సభ్యులకు 48 గంటల్లోనే రుణాన్ని అందిస్తున్నామని స్త్రీనిధి సంస్థ ఎండీ విద్యాసాగర్ రెడ్డి తెలిపారు. 48 గంటల్లో రుణం అందిస్తారా అంటూ కమిటీ చైర్పర్సన్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.