న్యూఢిల్లీ : కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా మహమ్మారి విలయ తాండవం సృష్టిస్తోంది. బెంగళూరులో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు గణనీయంగా పెరిగిపోతుండటంతో కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. కరోనా వ్యాప్తిని అరికట్టకపోతే.. వైద్యసేవల నిర్వహణ మరింత కష్టతరమవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి లవ్ అగర్వాల్ పేర్కొన్నారు.
బెంగళూరు, చెన్నైలో కరోనా కేసులు ప్రమాదకరంగా పెరుగుతున్నాయని వెల్లడించారు. ఒక్క బెంగళూరులోనే వారం రోజుల్లో లక్షన్నర పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. బెంగళూరులో పాజిటివిటీ రేటు 50 శాతం కంటే ఎక్కువగా ఉందని స్పష్టం చేశారు. ప్రతి ఇద్దరిలో ఒకరికి కరోనా వ్యాప్తి చెందిందని తెలిపారు. తమిళనాడులో 38 వేల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. కోజికోడ్, ఎర్నాకులం, గురుగ్రామ్ జిల్లాల్లో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని చెప్పారు.
మంగళవారం కర్ణాటక రాష్ర్ట వ్యాప్తంగా 44,631 పాజిటివ్ కేసుల నమోదు కాగా, 292 మంది మరణించారు. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 16,90,934కు చేరుకోగా, మరణాల సంఖ్య 16,538కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,64,363. ఇక బెంగళూరు అర్బన్ జిల్లాలో మంగళవారం ఒక్కరోజే 20,870 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 132 మరణాలు సంభవించాయి. బెంగళూరులో పాజిటివ్ కేసుల సంఖ్య 8,40,274కు చేరగా, ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,01,712. మరణాలు 6,845.
ఇవి కూడా చదవండి..