బెంగళూరు : కాబోయే భార్య నగ్న చిత్రాలను ఓ డాక్టర్ ఇన్స్టాగ్రాంలో పోస్టు చేశాడు. ఆ ఫోటోలను సరదా కోసమే పోస్టు చేశానని చెప్పడంతో ఆమె ఖంగుతింది. ఇక గెట్ టు గెదర్ పార్టీ ఏర్పాటు చేసి ఆ డాక్టర్ను చంపేసింది. ఈ దారుణ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడుకు చెందిన వికాస్ రాజన్ తన ఎంబీబీఎస్ విద్యను ఉక్రెయిన్లో పూర్తి చేశాడు. చెన్నైలో కొన్నాళ్లు ప్రాక్టీస్ చేశాడు. ఆ తర్వాత బెంగళూరుకు వెళ్లాడు. అక్కడ ఓ ప్రయివేటు క్లినిక్లో పని చేస్తూ.. విదేశాల్లో ఎంబీబీఎస్ చదవాలనుకునే వారికి శిక్షణ ఇచ్చేవాడు. అయితే రెండేండ్ల క్రితం సోషల్ మీడియాలో ప్రతిభ అనే ఆర్కిటెక్చర్ డాక్టర్ వికాస్కు పరిచయమైంది. ఇద్దరి పరిచయం ప్రేమకు దారి తీసింది. వారి ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించడంతో పెళ్లికి కూడా సిద్ధమయ్యారు.
అయితే డాక్టర్ వికాస్.. తన ప్రేయసి ప్రతిభ నగ్న చిత్రాలను.. ఇన్స్టాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి పోస్టు చేశాడు. ఇలా ఎందుకు చేశావని ప్రియుడ్ని ఆమె నిలదీయగా.. సరదా కోసమేనని బదులిచ్చాడు. అతని సమాధానం ఆమెలో మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. ఇంకేముంది అదే రోజు అతన్ని మట్టుబెట్టేందుకు ప్లాన్ చేసింది. తన స్నేహితులతో గెట్ టు గెదర్ ఏర్పాటు చేసి, వికాస్ను పిలిచింది. ఇక పీకల దాకా మద్యం సేవించారు. ఈ క్రమంలో ప్రతిభకు, వికాస్కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రతిభ తన స్నేహితులతో కలిసి వికాస్ను తీవ్రంగా కొట్టింది. అతను స్పృహ కోల్పోవడంతో ఆస్పత్రికి తరలించారు. కోమాలోకి వెళ్లిన వికాస్ ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వికాస్ మృతికి తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రతిభ పోలీసులకు చెప్పింది. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారిచంగా చేసిన నేరాన్ని అంగీకరించింది. దీంతో ప్రతిభతో పాటు ఆమె స్నేహితులైన గౌతమ్, సుశీల్, సునీల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.