కోల్కతా, ఏప్రిల్ 8: కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం రూపొందించిన నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)పై రోజుకో రాష్ట్రం తిరుగుబాటు చేస్తున్నది. ఇటీవలే తమిళనాడులో సొంత విద్యావిధానం కోసం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఓ కమిటీ వేయగా, తాజాగా పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడిచింది.తమ రాష్ట్రంలో సొంత విద్యా విధానం (ఎస్ఈపీ) అమలు చేసుకొంటామని బెంగాల్ విద్యాశాఖ మంత్రి బ్రత్య బసు గురువారం ప్రకటించారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారుకు, బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి అనేక అంశాల్లో తీవ్ర విబేధాలు కొనసాగుతున్న తరుణంలో ఎస్ఈపీ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకొన్నది. ‘ఇతర అంశాల్లాగే ఎన్ఈపీ అమలుపై కూడా కేంద్రప్రభుత్వం మాపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నది. అయినప్పటికీ ఎన్ఈపీని బెంగాల్లో అమలుచేయబోం. మా సొంత విద్యా విధానాన్ని రూపొందించుకోవాలని నిర్ణయించాం. ఇందుకోసం పదిమందితో కమిటీని కూడా వేసి రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని కోరాం’ అని బసు తెలిపారు.