శ్రీరాంపూర్/ రామకృష్ణాపూర్, మే 25: సింగరేణి స్థలాల్లో నివాసముంటున్న వారికి గతంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధీకరణ ప్రక్రియను మొదలుపెట్టింది. శ్రీరాంపూర్, సీసీసీ, క్యాతనపల్లి మున్సిపాలిటీ రామకృష్ణపూర్ పరిధిలో సొంత ఇండ్లు కట్టుకొని నివాసముంటున్న 2,242 కుటుంబాలకు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే దివాకర్రావు బుధవారం పట్టాలను పంపిణీ చేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియం, క్యాతనపల్లిలో సూపర్ బజార్ సెంటర్లో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ.. కార్మిక, కార్మికేతర కుటుంబాలకు స్థలాల క్రమబద్ధీకరణతో సర్వహక్కులు లభిస్తాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కృషి మూలంగానే ఈ పట్టాలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ.. ఏండ్లుగా ఇక్కడ నివసిస్తున్న ప్రజల అస్తిత్వాన్ని కాపాడేందుకే పట్టాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జాతీయ సంఘాలు రద్దు చేయించిన వారసత్వ ఉద్యోగాలను తిరిగి కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని స్పష్టం చేశారు. ఓట్లకోసమే విపక్షాలు పాదయాత్రలు, రచ్చబండలు అంటూ నాటకాలాడుతున్నాయని ఎద్దేవా చేశారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్, మంచిర్యాల కలెక్టర్ భారతీహోళికేరి, తదితరులున్నారు.