టీమిండియా అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వారసుడు అర్జున్ ఎంట్రీపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున అతడిని ఆడిస్తారని అంతా భావించారు. కానీ ముంబై మాత్రం అర్జున్ను పక్కనబెట్టింది. ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఇదే విషయంపై టీమిండియా లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ కూడా స్పందించారు.
కపిల్ దేవ్ మాట్లాడుతూ.. ‘అందరూ అతడి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు..? ఎందుకంటే అతడు సచిన్ టెండూల్కర్ కొడుకు. అర్జున్ను ముందు అతడి ఆటను ఆస్వాదించనివ్వండి. ఇప్పుడే సచిన్తో పోల్చవద్దు. టెండూల్కర్ పేరు ఉండటం వల్ల అర్జున్కు లాభాలెన్ని ఉన్నాయో నష్టాలూ అన్నే ఉన్నాయి..
ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డాన్ బ్రాడ్మన్ కొడుకు తన పేరును (జాన్ బ్రాడ్మన్.. జాన్ బ్రాడ్సెన్గా) మార్చుకున్నాడు. తన పేరు వెనకాల తండ్రి పేరు ఉండటంతో అందరూ అతడిని బ్రాడ్మన్తో పోల్చి చూశారు. ఆ ఒత్తిడిని అతడు తట్టుకోలేకపోయాడు..’ అని అన్నారు.
అంతేగాక అర్జున్పై ఒత్తిడి తీసుకురావొద్దని, సచిన్ ఆటలో సగం ఆడినా అది గొప్పే అని కపిల్ చెప్పుకొచ్చారు. ‘అర్జున్ మీద ఒత్తిడి తీసుకురాకండి. అతడు కుర్రాడు. అతడి తండ్రి సచిన్ అయినప్పుడు మనం అర్జున్కు ఇంకేం చెప్పగలం..? కానీ నేను అర్జున్కు ఒక సలహా ఇవ్వదలుచుకున్నా.. నీ లైఫ్ను నువ్ ఎంజాయ్ చెయి.. నువ్వు ప్రత్యేకించి నిరూపించుకోవాల్సిందేమీ లేదు. మీ నాన్న ఆడిన దాంట్లో 50 శాతం నువ్వు సాధించినా అది తక్కువేమీ కాదు.. సచిన్ పేరు రాగానే మన అంచనాలు ఆకాశాన్నంటుతాయి. ఎందుకంటే టెండూల్కర్ సాధించిన రికార్డులు మాములువి కాదు కదా…’ అని ముగించారు.