కరీంనగర్ : వర్షాలు తగ్గినా సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉంది. వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. వర్షాల అనంతరం ప్రబలుతున్న సీజనల్ వ్యాధులపై జిల్లాస్థాయి అధికారులతో మంత్రి గంగుల కమలాకర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ఈ సీజనల్ వ్యాధులు చాలా వరకు తగ్గాయన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా సురక్షిత మంచినీటి సరఫరాతో చాలా వరకు అంటూ వ్యాధులు, సీజనల్ వ్యాధులు కూడా చాలా తగ్గాయని స్పష్టం చేశారు.
మలేరియా, డెంగీ కేసులు పెరగకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నామని, అన్ని జిల్లాల్లో కిట్స్ అందుబాటులో ఉంచామని స్పష్టం చేశారు. ప్రతి ఆదివారం హెల్త్ టీమ్ శుభ్రతకుస సంబంధించిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని చెప్పారు. నిల్వ ఉన్న నీటి ద్వారా డెంగీ వ్యాప్తి చెందుతుందన్నారు. ప్రజలందరూ తమ తమ ఇండ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వ్యాధులు రాకుండా ఉండేందుకు ప్రభుత్వనికి సహకరించాలని కోరారు.
ప్రభుత్వ హాస్టల్ లో సన్న బియ్యం..
ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్పిటల్స్లో మధ్యాహ్న భోజనం క్వాలిటీ ఉండేలా చూసుకోవాలని అధికారులకు స్పస్టమైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.
బూస్టర్ డోస్ వేసుకోండి..
బూస్టర్ డోస్ వేసుకోవాలని ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ప్రభుత్వనికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు.