ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు పొందిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తాజాగా దక్షిణాఫ్రికాలో వచ్చే ఏడాది నుంచి జరుగబోయే సౌతాఫ్రికా టీ20 క్రికెట్ లీగ్ (CSA T20)లో సైతం పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. జోహనస్బర్గ్ ఫ్రాంచైజీని దక్కించుకున్న చెన్నై.. ఆ జట్టుకు టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనిని మెంటార్గా నియమించుకోవాలని భావిస్తున్నది. అయితే సీఎస్కే ఆశలపై బీసీసీఐ నీళ్లుచల్లింది.
ధోనిని మెంటార్గా నియమించుకోవడం కుదరదని.. ఒకవేళ అలా చేయాల్సి వస్తే ధోని తమతో ‘బంధం’ తెంచుకుని వెళ్లాల్సి ఉంటుందని సీఎస్కేకు చెప్పింది. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. భారత్ తరఫున ఆడిన, ఆడుతున్న క్రికెటర్ గానీ, ఇక్కడి దేశవాళీలో ఆడుతున్న ఆటగాడు గానీ విదేశీ లీగ్స్లో ఆడటానికి అవకాశం లేదు. ఒకవేళ అలా ఆడాల్సి వస్తే సదరు ఆటగాడు జాతీయ జట్టు నుంచి రిటైర్మెంట్ అయినా ప్రకటించాలి లేదంటే బీసీసీఐతో బంధం అయినా (మళ్లీ దేశవాళీలో ఆడకుండా) తెంచుకోవాలి.
ధోని విషయానికొస్తే అతడు ఇప్పటికే జాతీయ జట్టునుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ ఇంకా ఐపీఎల్ ఆడుతున్నాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్లో రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఊహాగానాలు వినిపిస్తున్నా దానిపై ధోని ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. తాజాగా సీఎస్కే.. సౌతాఫ్రికాలో తమ ఫ్రాంచైజీకి ధోనిని అనుమతించాలని కోరినా బీసీసీఐ మాత్రం తమ నిర్ణయాన్ని కరాఖండీగా చెప్పేసింది.
ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘దేశవాళీలో ఆడుతున్న క్రికెటర్ గానీ జాతయ జట్టుకు ఆడుతున్న ఆటగాడు గానీ ఫారెన్ లీగ్స్లో ఆడాలనుకుంటే వాళ్లు బీసీసీఐతో సంబంధం తెంచుకుని వెళ్లాల్సి ఉంటుంది..’ అని స్పష్టం చేశాడు. కాగా ప్లేయర్ల మీద ఆంక్షలు పెడుతున్న బీసీసీఐ.. సహాయక సిబ్బంది మీద కూడా అదేరీతిన వ్యవహరిస్తుండటంతో ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లు బీసీసీఐపై అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తున్నది.