హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): దేశంలో బీసీ కులగణన చేపట్టాలని కేంద్రప్రభుత్వాన్ని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. 90 ఏండ్ల నుంచి దేశంలో బీసీ కుల గణన చేపట్టలేదని, ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు అన్నారు. సోమవారం టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కేంద్ర ప్రభుత్వానికి వివిధ డిమాండ్లతో తీర్మానాన్ని నామా ప్రవేశపెట్టారు. బీసీల కులగణనతోపాటు ఓసీబీలకు కేంద్రంలో మంత్రిత్వశాఖ ఏర్పాటు, ఎస్సీ వర్గీకరణ, ఎస్టీ, మైనార్టీ రిజర్వేషన్ల పెంపు, సమాఖ్య స్ఫూర్తిని నిలబెట్టి, ఏపీ పునర్విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని తీర్మానంలో కోరారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మాయమాటలు చెప్తున్న బీజేపీ నేతలు, తెలంగాణ ప్రాజెక్టుల కోసం పార్లమెంట్లో ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. ఇలాంటివారికి ఓటు అడిగే హక్కులేదని స్పష్టంచేశారు. ఈ తీర్మానాన్ని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి బలపరిచారు. దీనిపై పార్లమెంట్లో మాట్లాడతానని, కేం ద్రంతో కొట్లాడతానని రంజిత్రెడ్డి అనడంతో కార్యకర్తలంతా చప్పట్లు కొట్టారు.