వర్ని: రాష్ట్రంలోని మహిళలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్న స్థానంలో ఉండి బతుకమ్మ చీరలను కానుకగా అందచేస్తున్నారని రాష్ట్ర శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వర్ని మండల కేంద్రంలో ఆదివారం వర్ని, రుద్రూరు, చందూరు, మోస్రా, కోటగిరి మండలాల లబ్ధిదారులకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అంతకు ముందు వర్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో సుమారు 89లక్షల వ్యయంతో నిర్మించిన వాటర్ ట్యాంకు, టాయిలెట్ బ్లాక్స్, స్టోర్ రూం, కవర్ షెడ్, మీటింగ్ హాల్, ప్రహరీలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగకు మహిళలకు ఇచ్చే కానుక విలువ ముఖ్యం కాదని, ప్రేమతో అందించే కానుకే ముఖ్యమన్నారు.
గత ఐదు సంవత్సరాల నుంచి నాలుగు కోట్ల మందికి ఈ కానుకలను పంచినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల కారణంగా ఉత్పత్తిలోను, ఉత్పాదకతలోను పంజాబ్ రాష్ట్రాన్ని మించి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. రైతుల్లో పేదరికం పోవాలని, రైతులే తమ సొంత డబ్బుతో వ్యవసాయానికి పెట్టుబడి పెట్టి లాభాలు అర్జించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారన్నారు.
బతుకమ్మ, దసరా పండుగను ప్రజలు సుఖ సంతోషాల మధ్య జరుపుకోవాలని స్పీకర్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి, బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, డీఆర్డీవో పీడీ చందర్ నాయక్, వర్ని, రుద్రూరు, మోస్రా జడ్పీటీసీ సభ్యులు బర్దావల్ హరిదాస్, నరోజి గంగారాం, గుత్ప విజయ భాస్కర్ రెడ్డి, ఎంపీపీలు మేక శ్రీలక్ష్మి వీరాజు, అక్కపల్లి సుజాత నాగేంధర్, వర్ని మార్కెట్ కమిటీ అధ్యక్షుడు బందెల సంజీవులు, వైస్ ఎంపీపీ దండ్ల బాలరాజు, టీఆర్ఎస్ వర్ని మండల అధ్యక్షుడు కల్లాలి గిరి, ప్రధాన కార్యదర్శి వెలగపూడి గోపాల్, అధికారులు పాల్గొన్నారు.