నమస్తే తెలంగాణ నెట్వర్క్: ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో..’, ‘రామ రామ నంది ఉయ్యాలో..’ అన్న బతుకమ్మ పాటలతో పల్లెలు పులకించాయి.. నాన బియ్యం బతుకమ్మ సందర్భంగా బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. గ్రామగ్రామాన మహిళలు బతుకమ్మలు పేర్చి వీధి ప్రధాన కూడళ్లలో ఆడి పాడారు.
చెరువులు, నదుల వద్ద గౌరమ్మకు మొక్కి నిమజ్జనం చేశారు. ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్లో జరిగిన వేడుకలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ దంపతులు, ఏఎంసీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, జడ్పీ కార్యాలయంలో జరిగిన వేడుకలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, జడ్పీ సీఈవో వీవీ అప్పారావు, డీపీవో హరిప్రసాద్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.