సత్తుపల్లి టౌన్, అక్టోబర్ 3 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా సత్తుపల్లిలో 9రోజులపాటు బతుకమ్మ సంబురాలు వైభవంగా జరిగాయి. సత్తుపల్లి మున్సిపాలిటీ, టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో సోమవారం సద్దుల బతుకమ్మ ముగింపు ఉత్సవాలు అంబరాన్నంటాయి. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పూలను పూజించే పండుగ బతుకమ్మ మాత్రమేనని, ఈ పండుగను తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏడాది అధికారికంగా నిర్వహించడంతోపాటు మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నదన్నారు. బతుకమ్మ వేడుకలను పురస్కరించుకుని మున్సిపాలిటీలోని కౌన్సిలర్ల ఆధ్వర్యంలో చిన్నారులు, మహిళలు బతుకమ్మలతో అంబేద్కర్ సెంటర్కు చేరుకున్నారు.
తంగేడు, గునుగు, చామంతి, పట్టుగుచ్చులు ఇలా తీరొక్క పూలతో బతుకమ్మలను అలంకరించారు. సాయంత్రం కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మహిళలంతా బతుకమ్మల చుట్టూ నృత్యాలు చేశారు. ప్రధాన వీధిపై ఒక్కేసి.. పువ్వేసి చందమామ… ఉయ్యాల పాటలు పాడుతూ చేతులతో చప్పట్లు కొడుతూ ఆడిపాడారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు పెద్దఎత్తున మహిళలు పాటలతో హోరెత్తించారు. సత్తుపల్లి పట్టణం పూలవనాన్ని తలపించింది. ప్రధాన రహదారిపై బతుకమ్మలతో ర్యాలీగా బయలుదేరి గుడిపాడు రోడ్డు మీదుగా తామరచెరువు వద్దకు నిమజ్జనానికి తరలివెళ్లారు. ర్యాలీలో అగ్రభాగాన మహిళలు కోలాట నృత్యాలు ఒక పక్క… మరోపక్క అమ్మవారు, ఇతర వేషధారణలు మరోపక్క అలరించడంతో పట్టణమంతా మేళతాళాలు, బతుకమ్మ గేయాలతో హోరెత్తిపోయింది.
బతుకమ్మలతో భారీ ర్యాలీ నేపథ్యంలో ఏసీపీ వెంకటేశ్ ఆధ్వర్యంలో సీఐ కరుణాకర్ శాంతిభద్రతలను పర్యవేక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, కౌన్సిలర్లు వీరపనేని రాధిక, అద్దంకి అనిల్, చాంద్పాషా, మట్టా ప్రసాద్, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు రఫీ, అంకమరాజు, వివిధ శాఖల అధికారులు, మహిళలు, చిన్నారులు, పట్టణవాసులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.