నమస్తే తెలంగాణ, న్యూస్ నెట్వర్క్ : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ ఆడపడుచులకు ఎంతో ప్రత్యేకం. అందుకు సీఎం కేసీఆర్ సర్కార్ ప్రతి ఏటా వారికి ఎనలేని గౌరవం ఇస్తున్నది. పండుగపూట సంతోషంగా ఉండాలని ఆడబిడ్డలకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ చీరలను సారెగా పంపిణీ చేసింది. బతుకమ్మ తొలి చీరను వనదేవతలు సమ్మక్కసారలమ్మకు మంత్రి సత్యవతి రాథోడ్ సమర్పించారు. అనంతరం మేడారంలో ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో మంత్రి మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలువురు మహిళలకు చీరలను అందజేశారు. జిల్లాలో 2,88,000 మంది ఆడపడుచులకు చీరలను పంపిణీ చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు. ఖమ్మం మహిళలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక శాంతినగర్ ఏఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, నయాబజార్ కళాశాల గ్రౌండ్, గట్టయ్య సెంటర్ ఫ్రీడమ్ పార్క్ లలో నిర్వహించిన కార్యక్రమాల్లో మహిళలకు బతుకమ్మ చీరలు అందజేశారు.
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పూలను పూజించే పండుగ బతుకమ్మను గౌరవించుకుంటున్నామని కొనియాడారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి వరలక్ష్మి ఫంక్షన్హాల్లో ఎమ్మెల్యే రవిశంకర్ మహిళలకు చీరలు అందజేశారు. ప్రభుత్వం అందజేస్తున్న బతుకమ్మ కానుక చరిత్రాత్మకమని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పాలనలో మహిళలకు సముచిత గౌరవం దక్కిందని తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోనీ సీఈఆర్ క్లబ్లో దేవాదాయ, ధర్మాదాయ, అటవీ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్కసుమన్ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. బతుకమ్మ చీరల పంపిణీతో సీఎం కేసీఆర్ ఆడబిడ్డల ముఖంలో ఆనందం, నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. చెన్నూర్ నియోజకవర్గంలో 55,800 మంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నట్టు వారు వివరించారు.