పెద్దపల్లి : బతుకమ్మ పండుగను మహిళలందరూ ఘనంగా జరుపుకోవాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం జూలపల్లి మండలం అబ్బాపూర్ గ్రామంలో పర్యటించిన మంత్రి మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ చేశారు.
అలాగే గ్రామంలో రెడ్డి సంఘ భవనం, ముదిరాజ్ సంఘ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ పంపిణీ చేసి మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నాటి పాలకులు ఏనాడు మహిళల బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. బతుకమ్మ చీరల పంపిణీ వెనుక గొప్ప ఉద్దేశం ఉందన్నారు.
చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలన్న సదుద్దేశంతో సీఎం కేసీర్ బతుకమ్మ చీరల పంపిణీ చేయాలని సంకల్పించారని మంత్రి పేర్కొన్నారు. నాణ్యమైన చీరలు పంపిణీ చేస్తూ.. చేనేత కార్మికుల ఆకలి చావులకు అడ్డుకట్ట వేశామన్నారు.
తెలంగాణ ఉద్యమంతో బతుకమ్మకు గుర్తింపు వచ్చిందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్, ఎంపీపీ రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.