హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆడబిడ్డల పండుగ బతుకమ్మ వేడుకలు ప్రగతిభవన్లో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మను తన తల్లి కల్వకుంట్ల శోభతో కలిసి ఆడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కవిత బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఇంటిల్లిపాదీ ఏకమై, ఊరువాడ ఒకచోట చేరి ఆడబిడ్డలు ఆనందంగా జరుపుకొనే ప్రకృతి పండుగ బతుకమ్మ అని కవిత పేర్కొన్నారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ పుట్టింటి కానుకగా కోటికి పైగా చీరలను అందజేస్తున్నారని తెలిపారు. తెలంగాణకే ప్రత్యేకమైన బతుకమ్మ పండుగను దేశవిదేశాల్లో ఉన్న తెలంగాణ బిడ్డలంతా ఘనంగా జరుపుకొంటారని వెల్లడించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ ఏడాది 8 దేశాల్లో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తుండటంపై సంతోషం వ్యక్తంచేశారు.
తెలంగాణ పల్లె జీవితాన్ని, ప్రకృతి రమణీయతను ఆవిష్కరించే పండుగ బతుకమ్మ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆదివారం బతుకమ్మ పండుగ ప్రారంభం సందర్భంగా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. పూలను పూజించే గొప్ప పం డుగ బతుకమ్మ అని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ట్విట్టర్లో మహిళలకు శుభాకాంక్షలు చెప్పారు.