ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వైభవంగా బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఒక బతుకమ్మ కథ ప్రచారంలో ఉంది. ఈ కథలో ప్రధానంగా పేర్కొనదగినది దోనుర్ యుద్ధం. ఈ యుద్ధ విజయం తర్వాత రాజేంద్ర చోళుడు వేములవాడ రాజేశ్వర దేవాలయంలోని భారీ శివలింగాన్ని తరలించుకు పోయినట్లు చెప్పబడింది. ఈ బతుకమ్మ ప్రచార కథకు మూలాధారం ఆవాల బుచ్చిరెడ్డి 2016లో ప్రచురించిన బృహతమ్మ-బ్రతుకమ్మ-బతుకమ్మ అనే పుస్తకం.
దోనుర్ యుద్ధం క్రీ.శ.1003-04లో చాళుక్య సత్యాశ్రయునికి, యువరాజు అయిన రాజేంద్ర చోళునికి మధ్యలో జరిగింది. దీని వివరాలు కర్ణాటక రాష్ట్రంలోని వొట్టూరు శాసనం (క్రీ.శ.1007) ద్వారా తెలుస్తుంది. దాని ప్రకారం రాజేంద్రచోళుడు గొప్ప సైన్యంతో కళ్యాణి చాళుక్య రాజధాని మాన్యఖేట్ ను, వారి రాజ్యంలోని తూర్పు భాగానికి కేంద్రంగా ఉన్న కొల్లిపాక (కొలనుపాక) ను ధ్వంసం చేసి, వీరికి సహాయంగా వచ్చిన వేంగి చాళుక్యులను (తూర్పు చాళుక్యులు, ఆంధ్ర ప్రాంతం) ఓడించి సర్వనాశనము చేశారని శాసనంలో పేర్కొన్నారు. అయితే దీనిలో వేములవాడ దేవాలయ ధ్వంస సంఘటనలు, శివలింగం తరలింపులాంటి అంశాలు లేవు. మహిమాన్వితంగా గుర్తింపు పొందిన రాజేశ్వరదేవుని గొప్పతనం మహత్యం వల్లనో, ఇతర కారణాల వల్లనో వేములవాడపై దాడి జరగలేదు. వేములవాడ చాళుక్యుల తర్వాత ఇక్కడ పాలించిన సామంత రాజులు కళ్యాణి చాళుక్య సార్వభౌమాధికారం అంగీకరించడం వల్ల చోళులు ఇక్కడ దండయాత్ర చేయకపోచ్చును. ఏ విధంగా చూసినా రాజేంద్ర చోళుడు వేములవాడ పై దాడి చేయలేదని తెలుస్తున్నది.
మరో వాదన ప్రకారం వేములవాడ రాజేశ్వర ఆలయంలోని భారీ శివలింగాన్ని తరలించుకుపోయి తంజావూరు బృహదీశ్వరాలయంలో ప్రతిష్టించారు అనుకుంటే, ఇప్పుడున్న బృహదీశ్వరాలయంలోని శివలింగం రాజరాజేశ్వర ఆలయంలో ఉంచడానికి అవకాశమే లేదు. క్రీ.శ.1083 రాజరాజేశ్వర దేవాలయ శాసనంలో రాజాదిత్యుడు దేవాలయ మరమ్మతులు చేసి నూతన లింగాన్ని ప్రతిష్టించారు అని మాత్రమే పేర్కొన్నారు. ఆ కాలంలో కేవలం దేవాలయ శైలిలో కొన్ని మార్పులు చేయబడ్డాయని చరిత్రకారులు భావిస్తున్నారు.
అంటే ఇప్పుడున్న దేవాలయం ఎత్తు, వెడల్పులలో ఎలాంటి మార్పులు లేవు. మరి బృహదీశ్వరాలయ శివలింగం ఎత్తు 23 అడుగులు, వెడల్పు 54 అడుగులు. అంత పెద్ద శివలింగం రాజేశ్వరాలయంలో ఉండే అవకాశం లేదు. కనుక తంజావూరులోని బృహదీశ్వరాలయ శివలింగం వేములవాడకు సంబంధించినది కాదని స్పష్టమవుతున్నది. తెలంగాణ దేవాలయాలపై పరిశోధనలు చేసిన డాక్టర్ రాధాకృష్ణ శర్మగాని, డాక్టర్ జైశెట్టి రమణయ్యగాని వేములవాడ దేవాలయాలకు సంబంధించిన మూల పథకాలు(ప్లాన్) తర్వాత కాలంలో మార్పులు, చేర్పులు జరిగాయని వారు ఎక్కడా పేర్కొనలేదు.
ఇక్కడ చర్చించాల్సిన మరో ముఖ్యమైన అంశం. వాస్తు శిల్ప శైలిని అనుసరించి వేములవాడలో ప్రాచీన దేవాలయంగా భీమేశ్వరాలయాన్ని గుర్తించడం జరిగింది. ఇది క్రీ.శ. 850-95 మధ్యలో పాలించిన బద్దెగుడి కాలంలో నిర్మించబడిందని భావిస్తున్నారు. తంజావూరు బృహదీశ్వరాలయ నిర్మాణానికి చాల ఏండ్లముందే దీన్ని నిర్మించారు. ఈ ఆలయ నమూనాను అనుసరించే రాజరాజ చోళుడు బృహదీశ్వరాలయం నిర్మించినట్లు తెలుస్తున్నది.
బృహదీశ్వరాలయమే భీమేశ్వరాలయ పోలికలతో కనబడుతుంది. కాబట్టి ఇక్కడి దేవాలయ నమూనాలను అనుసరించి భారతదేశంలోనే గొప్ప దేవాలయాన్ని నిర్మించిన రాజరాజ చోళుడు, తన కుమారుడిని ప్రోత్సహించి ఇక్కడి శివలింగాన్ని తరలించుకు పోయాడంటే నమ్మశక్యంగా లేదు. ఆనాటి రాజులు స్వమతానికి సంబంధించిన ఆలయాలు ధ్వంసం చేసిన ఉదంతాలు చరిత్రలో లేవు. దేవున్ని ఎత్తుకెళ్ళిన దాఖలాలు లేవు. అందువల్ల వేములవాడ రాజేశ్వరాలయం మీద దండయాత్ర చేసి శివలింగాన్ని తరలించుకు పోవడం అంతా అవాస్తవం. దానికి సరైన చారిత్రక ఆధారాలు లేవు. కేవలం బతుకమ్మ పండుగ ప్రాముఖ్యత కోసం ఈ పరికల్పనలు చేసినట్లు కనబడుతుంది. అయితే వేములవాడలో బతుకమ్మ ఏడు రోజులలో నిర్వహించడం ఒక ప్రత్యేకత.
వేములవాడ చాళుక్యుల కాలంలో వివిధ రూపాలలో అంటే పోచమ్మ, చౌడమ్మగా పూజింపబడింది. కాకతీయ గణపతి దేవుని కాలం (క్రీ.శ.1211)లో వేయబడిన నల్లగొండ జిల్లా వాడపల్లి (ఒడపల్లి) శాసనంలో మొట్టమొదటిసారి బతుకమ్మ పేరును స్పష్టంగా చూడవచ్చును. ఈ శాసనంలో కృష్ణ , మూసీనదులు సంగమించే చోట బతుకేశ్వర స్థానం ఉందని వివరించింది. అంటే ఈ ప్రదేశంలో బతుకమ్మలు నిమజ్జనం చేసేవారని తెలంగాణ ప్రముఖ చరిత్రకారులు డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ అభిప్రాయం. కాసె సర్వప్ప రచించిన సిద్ధేశ్వర చరిత్రలో బతుకమ్మ పాటలు ఉన్నాయి. మొత్తానికి దేశవ్యాప్తంగా ఆశ్వియుజ మాసంలో కొనసాగే శరన్నవరాత్రులలో భాగంగా తెలంగాణ సామాన్య జన ఆరాధన ప్రతిరూపమే బతుకమ్మ. బతుకమ్మ తెలంగాణ ప్రజల సంస్కృతి, వారసత్వానికి చిహ్నం.
బతుకమ్మ పండుగ ఎప్పుడు ప్రారంభం అయ్యింది. ఎక్కడ ప్రారంభమైంది అనే వివరాలలోకి వెళితే. బతుకమ్మకు మూలం అమ్మవారిని ఆరాధించడం. తెలంగాణలో అమ్మవారిని పూజించడం రాతి యుగం నుంచి మొదలైంది. దక్షిణ భారతదేశంలో తొలి సామ్రాజ్యాన్ని స్థాపించిన శాతవాహనులు గౌరి పశుపతుల పేర్లతో అమ్మవారిని పూజించినట్లుగా తెలుస్తుంది.
– డాక్టర్ సందెవేని తిరుపతి, 98496 18116
– డాక్టర్ పోతరవేని తిరుపతి, 99631 17456