రవీంద్రభారతి, మే 3: కుల, వర్ణ వ్యవస్థ, లింగ వివక్షను ఆనాడే వ్యతిరేకించిన అభ్యుదయవాది మహాత్మా బసవేశ్వరుడని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి చెప్పారు. తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బసవేశ్వరుని 889వ జయంతి వేడుకలను మంగళవారం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ బసవేశ్వరుని ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సాంస్క్రృతిక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం మహనీయుల జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించి గౌరవించుకుంటున్నదని చెప్పారు.
లింగాయత్ ప్రజల ఆత్మగౌరవ భవనం కోసం కోకాపేటలో ఎకరం భూమితోపాటు రూ.10 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని గుర్తుచేశారు. హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం బసవేశ్వరుని జయంతిని అధికారికంగా నిర్వహించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, అందోల్ ఎమ్మెల్యే క్రాంతికుమార్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, బీసీ కమిషన్ సభ్యులు సీహెచ్ ఉపేందర్, శుభప్రద్ పటేల్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, సంగీత నాటక అకాడమీ మాజీ చైర్మన్ బీ శివకుమార్, భాషా సంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సంగమేశ్వర్, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బసవేశ్వరుని సందేశం ఆచరణీయం
మనుషులందరూ ఒకటే, కులాలు, ఉపకులాలు లేవన్న మహాత్మా బసవేశ్వరుని సందేశం ఆచరణీయమని ఢిల్లీ తెలంగాణభవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ చెప్పారు. మంగళవారం న్యూఢిల్లీలోని తెలంగాణభవన్లో సామాజిక వివక్షను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయవాది, వీరశైవ మత స్థాపకుడు మహాత్మా బసవేశ్వరుని 889వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బసవేశ్వరుని చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. ప్రతిఒకరూ బసవేశ్వరుడు చూపిన మార్గంలో నడవాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉన్నదని గౌవర్ ఉప్పల్ సూచించారు.