భువనేశ్వర్: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తయ్యాయి. ఇటీవలే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో ఉత్సవాలు కూడా జరుపుకున్నాం. ఓ పక్క టెక్నాలజీలో దూసుకుపోతున్నప్పటికీ మరోపక్క దేశంలో ఇప్పటికీ అభివృద్ధి ఫలాలు అందని ప్రాంతాలు చాలా ఉన్నాయి. అలాంటిదే ఒడిశాలోని కుద్ గుండేర్పూర్. బ్యాంకింగ్ సేవల కోసం ఆ ఊరి ప్రజలు 75 ఏండ్లు వేచి ఉండాల్సి వచ్చింది. ఎట్టకేలకు బుధవారం అక్కడి గ్రామ పంచాయతీలో ఉత్కల్ గ్రామీణ బ్యాంకు కస్టమర్ సర్వీస్ పాయింట్ (సీఎస్పీ)ని ఏర్పాటు చేసింది.
సంబాల్పూర్ జిల్లాలోని కుద్ గుండేర్ఫూర్.. మహానది పాయలుగా విడిపోయిన ఒక దీవిలో ఉన్నది. భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో అక్కడున్న 5 వేల జనాభాకు ప్రభుత్వ పథకాలు కూడా సరిగా అందడం లేదు. ప్రతి పనికి నదిని దాటాల్సిందే. అది వైద్యం అయినా, బ్యాంకింగ్ సేవలు, ప్రభుత్వ ప్రయోజనాల కోసమైనా. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం అందించిన ప్రతిఫలాలు కూడా వారికి అందకుండా పోయాయి. దీంతో సీఎం నవీన్ కుమార్ ప్రభుత్వం ఆ గ్రామాన్ని రాష్ట్రంలో ప్రధాన భూభాగంతో కలుపుతూ గతేడాది ఫిబ్రవరిలో ఓ బ్రిడ్జిని నిర్మించింది. ఈ నేపథ్యంలో ఉత్కల్ గ్రామీణ బ్యాంకు అక్కడ కస్టమర్ సర్వీస్ పాయింట్ను ఏర్పాటు చేసింది. గ్రామ సర్పంచి కొబ్బరికాయ కొట్టి సీఎస్పీని ఓపెన్ చేసింది. దీంతో 5 వేల మంది ఉన్న ఆ గ్రామ జనాభాకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో అక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.