డిజిటల్ బ్యాంకింగ్ లావాదేవీలు పెరిగే కొద్దీ రకరకాల బ్యాంకింగ్ సేవల సమస్యలు తలెత్తున్నాయి. చెల్లింపుల్లో సమస్యలు, సొమ్ము జమ కాకపోవడం, అకారణంగా రుణాల నిరాకరణ, డిజిటల్ చెల్లింపుల్లో అవకతవకలు, డిపాజిట్లపై వడ్డీ జమచేయకపోవడం, కొన్ని సందర్భాల్లో ఎలాంటి కారణం చూపకుండానే వివిధ ఛార్జీల విధింపు, అకౌంట్లను మూసివేయడానికి నిరాకరించడంతో పాటు రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు పాటించకపోతే బ్యాంక్లపై ఫిర్యాదు చేసేందుకు ఏర్పాటైన వ్యవస్థే బ్యాంకింగ్ అంబుడ్స్మన్. 2006లో ఏర్పాటు అయిన ఈ వ్యవస్థ ఇప్పటికే అనేక సమస్యలను పరిష్కరించింది. బ్యాంకుపై అంబుడ్స్మన్కు ఫిర్యాదు చేయాలంటే మూడు కారణాలు చూపవచ్చు. మీరు నేరుగా ఫిర్యాదు చేసిన సరే బ్యాంకు నెల రోజుల్లోగా స్పందించకపోయినా, లేదా అసలు మీ ఫిర్యాదునే స్వీకరించకపోయినా లేదా బ్యాంకు ఇచ్చిన సమాధానం మీకు నచ్చకపోయినా సరే అంబుడ్స్మన్కు అందుకు సంబంధించిన వివరాలతో నేరుగా అంబుడ్స్మన్కు ఫిర్యాదు చేయవచ్చు.
ఇందుకోసం https://secweb.rbi.org. in/BO/precompltindex.htm అనే వెబ్సైట్ లింక్ క్లిక్ చేసి మీ ఫిర్యాదును అప్లోడ్ చేయవచ్చు. అలాగే మీ ఫిర్యాదుకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా జత చేయాల్సి ఉంటుంది. బ్యాంకుకు మీరిచ్చిన ఫిర్యాదు కాపీ, బ్యాంకు ఇచ్చిన సమాధానం కూడా జతచేయాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటికే మీ ఫిర్యాదుకు సంబంధించి అంబుడ్స్మన్ నుంచి మీకు సమాధానం వస్తే రెండోసారి ఫిర్యాదు చేయడానికి లేదు. అలాగే మీ ఫిర్యాదును ఇప్పటికే కోర్టు లేదా ఫోరమ్ లేదా ఆర్బిట్రేటర్ పరిష్కరించినా కూడా మీరు మళ్లీ అంబుడ్స్మన్కు ఫిర్యాదు చేయలేరు. వినియోగదారుల ఫిర్యాదులను స్వీకరించడానికి అంబుడ్స్మన్ ఎలాంటి ఫీజును వసూలు చేయదు. ఇంటర్నెట్లో ఫిర్యాదు చేయలేకపోతే, సంబంధిత డాక్యుమెంట్లన్నింటీనీ పోస్టులో రిజర్వ్బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయంలో ఉండే అంబుడ్స్మన్కు పంపించవచ్చు. సాధారణంగా నెల రోజుల లోపే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అంబుడ్స్మన్ ఆదేశాలను బ్యాంకులు పాటించాల్సిందే. బ్యాంకింగ్ సేవలపై ఫిర్యాదులను కోర్టులు, వినియోగదారుల ఫోరం కంటే ముందు అంబుడ్స్మన్కే దరఖాస్తు చేయండి.