ఢాకా : బంగ్లాదేశ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రయాణికులతో వెళ్తున్న పడవ మునగడంతో 23 మంది దుర్మరణం చెందారు. ఇంకా డజన్లకొద్దీ జనం గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న అధికార యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. అయితే, ఇప్పటి వరకు వెలికితీసిన మృతదేహాల్లో మహిళలు, పిల్లలు ఉన్నారని ఉత్తర పంచగఢ్ జిల్లా పాలనాధికారి జహరుల్ ఇస్లాం తెలిపారు. గల్లంతైన వారి సంఖ్య ఖచ్చితంగా ఎంతన్నది తెలియదని పేర్కొన్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో బోటులో దాదాపు 70 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్లో ఇటీవలి కాలంలో పడవ ప్రమాదాలు భారీగా జరుగుతున్నాయి. ఏటా వందలాది మంది జనం ప్రాణాలను కోల్పోతున్నారు. సరైన భద్రతా చర్యలు లేకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నట్లుగా విమర్శలున్నాయి. గత మే నెలలో పద్మ నదిలో స్పీడ్బోట్ ఇసుక లోడ్తో ఉన్న బల్క్ క్యారియర్ను ఢీకొట్టిన ఘటనలో 26 మంది మృతి చెందారు.