హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో గెలువాలంటే ముందుగా ప్రజల అభిమానాన్ని పొందాలి. తమ గురించి ఆలోచించేవారిని.. తమ పక్షాన నిలబడినవారినే ప్రజలు అభిమానిస్తారు. రాజకీయ ప్రాథమిక సూత్రాల్లో ఇదొకటి. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం పూర్తి భిన్నం. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ప్రజల్లో సానుభూతి కోసం ప్రయత్నిస్తుంటారు. ప్రజల దృష్టిలో పడేందుకు దొంగ దీక్షలకు దిగడమో.. లేదా ఏదో ఒక అలజడి సృష్టించి తనపై దాడి జరిగిందని నాటకాలు ఆడటమో చేస్తుంటారు. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. బండి సంజయ్ గతేడాది మార్చి 11న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అప్పటినుంచి ఇప్పటివరకు జీహెచ్ఎంసీతోపాటు రెండు ఉపఎన్నికలు జరిగాయి. శనివారం హుజూరాబాద్ ఉపఎన్నిక జరగనున్నది. ఆయా సందర్భాల్లో జరిగిన పరిణామాలను విశ్లేషిస్తే..
దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ గత నవంబర్ 3న జరిగింది. దానికి సరిగ్గా వారంరోజుల ముందు బండి సంజయ్ డ్రామా మొదలైంది. అక్టోబర్ 26న నాటి బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు బంధువుల ఇండ్లల్లో పోలీసులు సోదాలుచేసి, లెక్కల్లోకి రాని డబ్బును స్వాధీనం చేసుకున్నారు. వాటిని దుబ్బాక ఎన్నికలో పంచేందుకే తీసుకొచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. దొంగతనం బయటపడుతుందనే భయంతో బండి సంజయ్ కార్యకర్తలతో సిద్దిపేటలో నానా హంగామాచేయించారు. సాయంత్రానికి ఆయనే సిద్దిపేటకు చేరుకోగా, అలజడులకు అవకాశం ఉండటంతో పోలీసులు అరెస్ట్చేశారు. దీంతో సంజయ్ తనపై దాడి జరిగిందని చెప్పుకోవడమే కాకుండా.. దీక్ష మొదలుపెట్టారు. రెండు రోజులకే షుగర్ లెవల్స్ పడిపోయాయంటూ విరమించడం గమనార్హం.
జీహెచ్ఎంసీకి గత ఏడాది డిసెంబర్ 1న పోలింగ్ జరుగాల్సి ఉన్నది. దానికి కొన్ని గంటల ముందు నవంబర్ 30వ తేదీ రాత్రి బండి సంజయ్ అనుచరులతో ఖైరతాబాద్లో హల్చల్చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు దీని ని అడ్డుకొనేందుకు ప్రయత్నించగా.. తనపై దాడిచేశారని ప్రచా రం చేసుకున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నించారు.
నాగార్జునసాగర్లో ఈ ఏడాది ఏప్రిల్లో ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలయ్యింది. దీనికి కొన్ని రోజుల ముందే బీజేపీ నేతలు ఉద్దేశపూర్వకంగా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను లక్ష్యంగా అలజడి సృష్టించేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో మార్చి 17న కోదాడ వద్ద కొందరు ఎమ్మార్పీఎస్, స్వేరో కార్యకర్తలు బండి సంజయ్ వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో తనపై దాడి చేశారంటూ నానా హంగామా చేశారు. ఎలాంటి దాడి జరుగలేదని అప్పటి సూర్యాపేట ఎస్పీ చెప్పారు.
తాజాగా హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో రైతు దీక్ష పేరుతో కొత్త డ్రామా మొదలుపెట్టారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రాన్ని నిలదీయాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం మొదలుపెట్టారు. పేరుకు రైతు దీక్షే అయినా కనీసం చుట్టుపక్కల ఒక్క అన్నదాత కూడా లేకపోవడం గమనార్హం. ఈ పరిణామాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని, బండి సంజయ్ చీప్ ట్రిక్స్కు పడిపోరని టీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నాయి.